Saturday, December 12, 2015

శివపురాణము--31



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు. ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము. సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది. అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒక నెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు. దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకా సుర సంహారం చేశాడు. లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి. యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు.

అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక

ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి. అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామివారే నేర్పారు. కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు.

సుబ్రహ్మణ్య స్వామి వారు అవతారములను స్వీకరించారు. ఇందులో ప్రధానమయిన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి.

తిరుజ్ఞాన సంబంధర్:

జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. ద్రవిడ దేశంలో శీర్గాళి అనే ఊరు పరమ పావనమయిన క్షేత్రం. అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. ఆ ఊరిలో శివ పాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భగవతి. వారికి పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన మూడు సంవత్సరముల వయసు బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయిన శివ పాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. నేనూ వస్తాను అని ఏడుపు మొదలు పెట్టాడు పిల్లవాడు. నాయనా, నాతో నీవెందుకు, వద్దు అన్నాడు తండ్రి. పిల్లవాడు వినలేదు. అపుడు పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు. పిల్లవాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది. అపుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్నా అని ఏడుస్తున్నాడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. పార్వతి వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు. అపుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు. పిల్లవాడు ఎత్తుకుని లాలించినా ఏడుపు ఆపలేదు. ఒక బంగారు పాత్రను తేసుకుఇ నీ స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి త్రాగించు వాడు ఏడుపు ఆపుతాడు అన్నాడు పరమశివుడు. అపుడు పార్వతీదేవి నాపాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది. మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా? అని అడిగింది. పిల్లవాడు మనలను నమ్మి అమ్మా నాన్నా అని ఏడ్చాడు. పాలు త్రాగించు అన్నాడు. అందుకే జ్ఞాన సంబంధర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు. మనమూ ఏడుస్తాము. కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. శంకరుడు అలా చెప్పిన పిదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీ దేవి. పాలను త్రాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్థానం అయిపోయారు. ఆయన పిల్లవాని దగ్గరికి వచ్చి నాయనా ఎంత పని చేశావురా ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా”

అన్నాడు. అపుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. మూడేళ్ళ పిల్లవాడు. భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించి పోయి భగవత్ దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే ఆ అంశాలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమయిన మార్గమును ఆ రోజులలో నలిపి వేస్తున్న వాళ్ళ దురాచారములను ఖండించదానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడు. ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు. కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోర్కె ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు. అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. శివునకు మారు పేరే జ్ఞానము. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమయిన జ్ఞానమును పొందినవాడు కనుక ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ పేరు.

వల్లీ కళ్యాణం – ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.

ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.

అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.

నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

2 comments:

Sai Bhaskar Peesapati said...

శివ పురాణం పూర్తి కథ pdf లో ఉంటే లింక్ ఇవ్వగలరు

Sai Bhaskar Peesapati said...

నా whatsapp నెంబర్ 8790661648