Saturday, December 19, 2015

శివపురాణము--38


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పూర్వకాలంలో భ్రుగువు అనే మహర్షి ఉండేవారు. ఆయన భార్యపేరు ఊర్జస్వతి. భ్రుగువుకి భార్గవుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. ఊర్జస్వతి ప్రియవ్రతుని కుమార్తె. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడి సోదరుడు. ఉత్తానపాదుడి పేరు వినేసరికి మీరు ధ్రువుడు జ్ఞాపకమునకు రావాలి. భార్గవునకు నలుగురు కుమారులు కలిగారు. వాళ్ళపేర్లు – చండుడు, అమర్కుడు, త్వాష్ట్రుడు, ధరాత్రుడు. చండుడు అమర్కుడు వీరిద్దరూ రాక్షసులకు గురువులు. ప్రహ్లాదునికి పాఠములు నేర్పిన గురువులు వీరే. భార్గవుడికి శుక్రుడనే పేరు ఉంది. భార్గవుడికి ఒక కోరిక పుట్టింది. సృష్టి క్రమంలో బ్రహ్మగారు ఒక జీవికి ఇన్ని సంవత్సరములు అని నిర్దేశిస్తాడు. ఆ తరువాత జీవి చనిపోవాలి. ఇపుడు భార్గవుడు బ్రహ్మగారు వ్రాసిన రాతను తిరగరాయాలనుకుంటున్నాడు. అందుకుగాను మృతసంజీవని అంటే చచ్చిపోయిన శరీరమును ఏశరీరంతో అయితే చచ్చిపోయాడో ఆ శరీరంతో మళ్ళీ పుట్టించాలి అని అనుకున్నాడు. ఈ కోరిక తీరడానికి కాశీ పట్టణంలో తపస్సు చేస్తే తొందరగా పరబ్రహ్మ తృప్తి చెందుతాడు. కాబట్టి తాను అక్కడికి వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకొని తపస్సు ప్రారంభించాడు. కాశీలో ఒక శివలింగమును ప్రతిష్ఠచేశాడు. దానికి ప్రతిరోజూ వెయ్యిమార్లు అభిషేకం చేసేవాడు. అందులో ఆయన తప్పకుండా మూడింటిని వాడేవాడు. మొదటిది పంచామృతములు, రెండవది శుద్ధజలము, మూడవది గంధోదకమును వాడాడు. అభిషేకానంతరం పరమశివుడికి అర్చన చేయాలి. ఇలా అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు. అవి సంపంగి, ఉమ్మెత్త, గన్నేరు, తామర, కొండగోగు, జాజి , కడిమి, పొగడ, కలువ, మల్లె, కమలములు, సొరపున్నపువ్వులు. వీటితో పాటు దర్భాగ్రములు మామిడి చిగుళ్ళు దుర్వాంకురములు కూడా అభిషేకంలో వాడతారు. 
భార్గవుడి పూజకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు మృతసంజీవని విద్యను ఉపదేశించాడు. ఒకసారి పరమేశ్వరుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా వెనకనుంచి పార్వతీదేవి వచ్చి పరిహాసమునకు పరమశివుని నేత్రములు మూసింది. అపుడు పరమశివుద్ ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదము తెచ్చిందో చేతులు తీసి చూడు అన్నారు. సమస్త బ్రహ్మాండములు చీకటి అయిపోయాయి. ఈ స్థితిలో అమ్మవారు చేతులు తీయగానే మరల ప్రకాశించాయి. ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపమును పొంది శివ చేష్టితంగా అంధకారమునందు కళ్ళు లేకుండా నల్లపిల్లవాడు ఒకడు పుట్టి ఏడుపు మొదలుపెట్టాడు. అంధకారం నుండి పుట్టిన వాడు కాబట్టి వాడికి అన్ధకుడు అని పేరు వచ్చింది. వాడు పర్వత సదృశుడై పెరిగిపోయి తనని సమీపించిన వారిని నోట్లో పడేసుకుంటున్నాడు. వీడెవడు? అని అమ్మవారు భర్తను అడిగింది. పరమశివుడు నువ్వు నా కళ్ళు మూయడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకూ నాకూ కొడుకే అన్నాడు. ఇప్పుడు వాడిని చంపివేయడానికి వీలులేదు. వాడిని కాపాడాలి అని వాడిని పిలిచి అరణ్యములకు పంపించివేశారు. 
హిరణ్యాక్షుడికి కొడుకులు కలగడం లేదని శంకరుని గూర్చి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై నీకు సరిపోయే నాకుమారుడొకడు పుట్టి పెరుగుతున్నాడు. నీవు వాడిని సొంత కొడుకుగా భావించవచ్చు తీసుకు వెళ్లి పెంచుకో అని అంధకుడిని ఇచ్చారు. వాడు అంధకాసురుడయ్యాడు. కొంతకాలం గడిచిన పిదప ఆదివరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు. అంధకాసురుడికి కళ్ళు లేవు. కాబట్టి వాడికి రాజ్యం ఇవ్వడం కుదరక పోవడంతో అంధకుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి కావాలి? అని అడిగారు. అప్పుడు వాడు రెండు వరములు కోరాడు. – నాకు కళ్ళను ఇవ్వవలసినది, నాకున్న బలంతో కంటితో చూస్తూ నేను లోకములనన్నిటిని గలవాలి. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు అన్నాడు. అపుడు బ్రహ్మగారు చూపును ఇస్తున్నాను. కానీ రెండవది నా పరిధిలో లేదు ఇంకొకమాట చెప్పు అన్నారు. అపుడు వాడు ఉత్తమజాతి, మధ్యమజాటి, కనిష్ఠజాతి స్త్రీలయందు ఉండే లక్షణములు అన్నీ ఏ తల్లినుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు భవిష్యత్కాలమునందు వర్తమాన కాలమునందు ఈ కాలములకు ముందు వెనుక కూడా ఉంటుందో ఏ తల్లి మహా సౌందర్యరాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలి’ అన్నాడు. అసలు అటువంటి కోరికే కోరకూడదు. బ్రహ్మగారు తథాస్తు అన్నారు.
ఒకనాడు వీడి భటులు కైలాస ప్రాంతమునకు వెళ్ళారు. మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారములు చేస్తోంది. ఈ భటులు వారిరువురినీ చూశారు. ఈ తపస్సు చేసుకునే వాడికి ఇంత అందమయిన భార్య ఎందుకు. అంధకాసురుడికయితే బాగుంటుంది అనుకుని వెళ్ళి అంధకాసురునికి చెప్పారు. వాడు నీ భార్యను నాకిచ్చెయ్యి. లేకపోతే చంపేస్తాను అని శివుడికి కబురు పెట్టాడు. అపుడు శివుడు నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతులలో నేను చచ్చిపోలేను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడరాదు అన్నాడు. వాడికి అర్థం కాలేదు. శంకరుడు మరోచోటికి వెళ్లి వేయి సంవత్సరములు తపస్సు చేసుకుంటాను అని పార్వతికి చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆయన భార్యను వదిలివేయలేదు. వాడి పాపం పండడానికి తాను మధ్యలో ఉండకూడదని అలా మాట్లాడాడు. వాడు అమ్మవారిని మోహంతో కూడిన చూపు చూడాలి. అటువంటి చూపు చూసి వాడు చచ్చిపోవాలి. ఇదీ శంకరుని ఉద్దేశం. ఇపుడు అంధకాసురుడు అమ్మవారి కోసమని యుద్ధం మొదలుపెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం. రాక్షసులందరూ అంధకాసురూడి పక్షం. యుద్ధం జరిగింది. ఆయుద్ధం వేయి సంవత్సరములు జరిగింది. శంకరుడు తపస్సు ముగించుకుని తిరిగి వచ్చాడు. 
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. విఘసుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గరనుంచి బ్రహ్మగారి వరకు దేవతలనందరినీ నోట్లో పడేసుకుని మింగేశాడు. శంకరుడు త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే మరల దేవతలందరూ వాడినోట్లోంచి బయటపడ్డారు. శంకరుడు రాక్షస సైన్యమును పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం శుక్రాచార్యుల వారు మృత సంజీవనీ విద్యతో వాళ్ళని బ్రతికించడం జరుగుతోంది. ఎంతమంది రాక్షసులను చంపినా వారు తిరిగి బ్రతికి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు శివుడు శుక్రుని బంధించి ఇక్కడకు తీసుకురండి అన్నాడు. దేవతలు వెళ్ళి శుక్రుడిని పట్టి శివుని దగ్గరకు తీసుకువచ్చారు. శివుడు ఆయనను నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్లి గర్భవాసం చేస్తున్నాడు. ఆయనకి బయట ఏం జరుగుతోందో కనపడుతోంది కానీ తానూ పునర్జీవితులని చేయడం కుదరదు. అన్నీ శివుడిలో ఉన్నాయని నేను ఏ స్తోత్రం చేశానో ఇప్పుడు వాటిని నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు. ఆఖరుకి అందరూ చచ్చిపోయారు. అంధకాసురుడు మిగిలిపోయాడు. శంకరుడు త్రిశూలంతో గ్రుచ్చాడు. చంపలేదు. వాడు త్రిశూలంమీద పడుకుని ఆయన జటాజూతమును పీకుతున్నాడు. శంకరుడు దానికి ప్రతీకారం చేయలేదు. వాడి దృష్టి కోణంలో మార్పు వచ్చింది. ఈ కంటితో ఇన్నాళ్ళనుంచి దేనిని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములని అనుకుంటున్నానో అవి యథార్థములు కావనే జ్ఞానం కలిగింది. అప్పుడు వాడు శంకరుని నూట ఎనిమిది నామములు చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుల పాదముల మీద పడి నా తప్పు మన్నించి నన్ను కరుణించండి అని ప్రార్థించాడు. అపుడు శంకరుడు నిన్ను ప్రమథగణములలో తీసుకుంటున్నాను అని చెప్పి వానిని తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడై భక్తితో బ్రతికేశాడు. 
శుక్రాచార్యుడు ఇంకా శివుని గర్భంలోనే ఉన్నారు. అక్కడే ఉంది శివుడిని గొప్ప స్తోత్రం చేశారు. భార్గవుడు చేసిన స్తోత్రమునకు శంకరుడు మిక్కిలి ప్రీతి చెందాడు. భార్గవునితో ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నీవు నా కుమారుడివి. హద్దు లేకుండా వరమును ఉపయోగించడం ఎంత ప్రమాదమునకు వెడుతుందో తెలుసుకున్నావు కదా! అని భార్గవుడిని విసర్జించాడు. ఈశ్వర శుక్రనాళంలోంచి బయటకు వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంక లేడు కనుక భార్గవుడు అనే పేరు ప్రక్కకిపోయి శుక్రాచార్యుడు అన్నపేరు ప్రకాశించింది. అంత గొప్ప స్థితిని శుక్రాచార్యుల వారు పొంది లోకమునంతటిని ప్రకాశింపజేశారు. అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టి కోణం నందు ఇటువంటి మార్పు రావాలి. మనం కోరరాని కోర్కెలు కోరినా ఈశ్వరుడు భక్తికి లోన్గుతాడు. కానీ అవి కొన్ని సార్లు ఇబ్బందుల వైపుకి తీసుకువెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోర్కె ఒక్కటే. మనం భగవంతుడిని అడగవలసింది ఒక్కటే. ఈశ్వరా, నీ పాదములయందు నిశ్చలమయిన భక్తిని నాకు కృపచెయ్యి అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మనలను కాపాడవలసిన బాధ్యత భగవంతుని మీద పడుతుంది. మీ మనస్సు కదిలిపోకుండా ఆయన తన పాదములను అందించాలి. కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు. ఇది మనం గ్రహించవలసిన నీతి. ఆ నీతిని గ్రహించి దానిని ఆచరణాత్మకం చేసుకున్న నాడు మనం ధన్యులం అవుతాం. మనకు అటువంటి శక్తిని ఈశ్వరుడు తననిర్హేతుకకృపాకటాక్షవీక్షణముల చేత మనకు యిచ్చి రక్షించుగాక! అని ప్రార్థన చేద్దాం.

No comments: