Friday, December 4, 2015

శివపురాణము--23


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--23   
గౌరీపూజ 
ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది. 
పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది. 
ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.
ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము. 
అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!

No comments: