Sunday, April 7, 2019

శివానన్దలహరీ





 శివానన్దలహరీ--1 - 30

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 ||

కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.

గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||

మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా  ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.
(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ | 
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే || 3 ||

మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను .

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ | 
హరిబ్రహ్మాదీనామపి  నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ || 4 ||

ఏదో కొంచెము ఫలమిచ్చెడు దేవతలెందరో కలరు. కలలోనైనను ఆ దేవతలను భజించుటగానీ ,ఆ దేవతలు కలుగచేయు ఫలమునుగానీ ఆశించను . మంగళస్వరూపుడవగు ఓ శంకరా! ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేరియున్న విష్ణువుకిగానీ , బ్రహ్మకుగానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని మిమ్ము పదేపదే వేడుకొనుచున్నాను .

స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే 
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయవిభో || 5 ||

స్మృతులయందుగానీ , శాస్త్రములయందుగానీ , వైద్యమునందుగానీ , శకునములు చెప్పుటయందుగానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందుగానీ , సంగీతము పాడి రంజింపజేయుటయందుగానీ , పురాణములు చెప్పుటయందుగానీ , మంత్రశాస్త్రమందుగానీ , స్తోత్రములు చేయుటయందుగానీ , నాట్యము చేయుటయందుగానీ , హాస్యములు చెప్పి నవ్వించుటయందుగానీ  నేర్పులేనివాడను . ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును ? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు . వేదప్రసిద్ధుడవూ , సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా ! నే నెవ్వడినో నాకేతెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము .

ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ | 
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః  || 6 ||

కుండగానీ , మట్టిముద్దగానీ , పరమాణువుగానీ , పొగగానీ , నిప్పుగానీ , పర్వతముగానీ , వస్త్రముగానీ , దారముగానీ  ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు . అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభం కలిగించుకొనక , శంభుని యొక్క పాదపద్మములను సేవించి , శీఘ్రముగా శివసాయుజ్యమును పొందుము.
(తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అటుకాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం)

మనస్తే పాదాబ్జే నివసతు వచస్త్సోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ |
తవధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః || 7 ||

ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ , నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ , నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ , నా యొక్క కన్నులు నీ దివ్యమంగళవిగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక . అటులైనచో ఇంకమీద నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఇచ్చగించవు . కావున అట్లు అనుగ్రహింపుమని భావము.

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || 8 ||

ఓ పశుపతీ ! దేవదేవుడవైన నిన్ను మూఢులు హృదయమునందు తలచక, ముత్యపుచిప్పలను వెండియనియూ, గాజురాళ్ళను మణులనియూ, పిండినీళ్ళను పాలనియూ, ఎండమావులను నీళ్ళనియూ భ్రమించునట్లుగా నీకంటే ఇతరులైనట్టి వారిని, దేవులనే భ్రాంతిచేత, సేవించుచున్నారు.

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే 
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః |
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో! || 9 ||

మనుష్యుడు తెలివితక్కువవాడై పుష్పములకొరకు లోతైన చెరువు లందు దిగుచున్నాడు, జనులు లేని భయంకరమైన అరణ్యములందునూ, విస్తీర్ణమైన పర్వతములందు తిరుగుచున్నాడు. కానీ ఓ పార్వతీపతీ! మనస్సనెడి పద్మము ఒక్కటే నీ పాదములయందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చన్న విషయాన్ని, ఈ జడులైన మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారే, ఆశ్చర్యంగాఉంది.

నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా 
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||

మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో 
నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11 ||

ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.

గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే
స్థితం చేద్యోగోసౌ  స చ పరమయోగీ స చ సుఖీ || 12 ||

ఓ శంకరా! మనుజుడు, గుహలో కానీ, ఇంటిలో కానీ, బయటనెచ్చటో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటియందు కానీ, పంచాగ్నిమధ్యమందు కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏమి లాభము? ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు స్థిరముగానుండునో అతడే గొప్పయోగి మరియూ అతడే పరమానందము కలవాడు అగును.


అసారే సంసారే నిజభజనదూరేఽజడ ధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ |
మదన్యః కో దీన స్తవ కృపణరక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే || 13 ||

ఓ పశుపతీ ! నీ సేవకు దూరమైన నిస్సారమైన ఈ సంసారములో గ్రుడ్డివాడనై భ్రమించునాకు మిక్కిలికరుణతో జ్ఞానమిచ్చి బ్రోవవయ్యా!. నాకన్నా దీనుడు  నీకు ఎవరున్నారు ? ముల్లోకాలకూ నీవే దీనరక్షకుడవు, శరణువేడదగినవాడవు.


ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః |
త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః || 14 ||

ఓ పశుపతీ! నీవు సమర్థుడవు, దీనులకు ముఖ్యబంధువువు కదా. నేను ఆ దీనులలో మొట్టమొదటివాడను. ఇంక మన ఇద్దరి బంధుత్వము గురించి  వేరే చెప్పనక్కరలేదు కదా. ఓ శివా! నా సమస్త అపరాధములనూ నీవు క్షమించుము. నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించుము. ఇదేకదా బంధుమర్యాద (బంధువులతో మెలగవలసిన తీరు).


ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యాన విముఖాం
దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్|| 15 ||

ఓ పశుపతీ! నీకు నా పై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనుకాడునదీ, దురాశలతో నిండినదీ అయిన నా తలరాతను ఏల తుడిచివేయవు ? అందుకు సమర్థుడవు కానిచో (కాను అంటావేమో)  ఏ ప్రయత్నమూ లేకుండా చేతిగోరుకొనతో దృఢమైన బ్రహ్మ శిరస్సును ఎలా పెకలించావు ?

విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర 
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః || 16 ||

సదాశివా! నాకేల విచారము ? బ్రహ్మదేవుడు భూమిపై ప్రజలకు దీనత్వమును (లలాటముపై) వ్రాసినాడు. (ఆ కారణముగా నేను దీనుడగుటచేత) దీనులను కాపాడు నీ కటాక్షము నిర్మలమైన కృపతో స్వయముగా నన్ను రక్షించుచున్నది. బ్రహ్మదేవుని నాల్గు శిరములను నీవు రక్షించుము. ఆయన దీర్ఘాయువగుగాక.
(బ్రహ్మదేవుడు దీనత్వమును వ్రాయుటచేతనే జనులకు శివుని కటాక్షమునకు పాత్రత కలిగినది కనుక అతనిని రక్షింపుమని వినతి).


ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః || 17 ||

ప్రభో! నా పుణ్యముచేతనో నీ కరుణచేతనో నీవు నాపై ప్రసన్నుడవైననూ, స్వామీ! నీ నిర్మల పాదపద్మములను ఎలా చూడగలను ? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతలసమూహము తమ రత్నకిరీటములతో నన్ను అడ్డగించుచున్నది.

త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా || 18 ||

ఓ శివా! లోకంలో నీవొక్కడవే మోక్షమునిచ్చువాడవు. విష్ణ్వాది దేవతలు నీవనుగ్రహించిన పదవులననుభవించుచూ (ఇంకనూ ఉత్తమ పదవులకై) నిన్ను కొలుచుచున్నారు. భక్తులపై నీకెంత దయ (అపరిమితము). నా ఆశ ఎంత (ఇంత అని చెప్పలేను).  నా అహంభావమునుబాపి సంపూర్ణకటాక్షముతో ఎప్పుడు నన్ను రక్షించెదవు ?

దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే
దురన్తే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ || 19 ||

ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను (అలా వ్రాసిన) బ్రహ్మదేవునియందు వాత్సల్యముచేత, తొలగించుటలేదు కాబోలు. నీవు (అలా) భక్తవత్సలుడవైనప్పుడు నిన్ను భజించి మేమూ కృతార్థులమవుతునాము కదా!

-- వేరొక అర్థము

ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను ఎందుకు తొలగించవు ? సహాయంచేయమని ఎవరినడుగను ? నిన్ను భజించి (ప్రీతి కలిగించి) మేమూ కృతార్థులమవుతున్నాము కదా!

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ 
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం 
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో || 20 ||

ఓ కపాలధారీ, సర్వవ్యాపకా, శివా, ఆదిభిక్షూ, నా దగ్గర ఒక కోతి ఉంది. అది, మోహమనే అడవిలో చరించుచున్నది, యువతుల స్తనములనే పర్వతములపై క్రీడించుచున్నది. ఆశా శాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులిడుతున్నది. అత్యంత చపలమైన నా మనస్సనే ఈ కోతిని భక్తి (అనే త్రాడు) తో కట్టివేసి నీ వశం చేసుకొనుము. 

(నా చంచల చిత్తమునకు త్వదేక శరణమైన భక్తిననుగ్రహింపుమని భావము).

ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం 
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం 
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 ||

 ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద నీవు నివసించుటకు ఒక కుటీరము ఉన్నది. అది ధైర్యమనెడి స్తంభము ఆధారముగా, సద్గుణములనే తాళ్ళతో గట్టిగా కట్టబడి ఉన్నది. ఆ కుటీరము విచిత్రముగా పద్మాకారములో నున్నది. దానిలో అటునిటు తిరుగవచ్చు (విశాలమైనది). అది నిర్మలమూ, అనుదినము సన్మార్గవర్తీ అయిన నా హృదయమనే కుటీరము. నీవు అమ్మతో సహా ఈ నా హృదయకుటీరములో ప్రవేశించి నివసింపుము.

(శంకరులు సద్భక్తుల నడత ఎలా ఉండాలో చూపుతున్నారు)

ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||
  
దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము.


కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో 
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో || 23 ||
  
శంకరా, మహాదేవా, నేను నీ పూజలు చేస్తాను. వెంటనే నాకు మోక్షమునిమ్ము. అలాకాకుండా పూజకు ఫలముగా నన్ను బ్రహ్మగానో, విష్ణువుగానో చేశావే అనుకో, మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసగా ఆకాశంలోనూ, వరాహముగా భూమిలోనూ వెతుకుచూ, ప్రభూ, నీవు కనపడక, ఆ భాధను నేనెలా భరించగలను ?

కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై-
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్థాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥24॥

ఓ దేవా! కైలాసము నందు బంగారముతోనూ మరియు మణులతోనూ నిర్మించిన సౌధంలో ప్రమథగణాలతో కలసి నీ ఎదురుగా నిలబడి,తలపై అంజలి మొక్కుచూ " ఓ ప్రభూ! సాంబా! స్వామీ! పరమశివా! రక్షించు" అని పలుకుచూ అనేక బ్రహ్మాయుర్దాయములను క్షణమువలే సుఖంగా ఎప్పుడు గడిపెదనో కదా!



స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ॥ 25 ॥

బ్రహ్మాది దేవతలు స్తుతించుచుండగా, మహర్షులు జయ జయ ధ్వానములు పలుకుచుండగా, ప్రమథగణములు ఆడుచుండగా, చేతులలో లేడినీ, ఖండపరశువునూ ధరించి, ఉమాదేవి ఆలింగనము చేసికొని యుండగా, మదించిన నంది మూపురముపై కూర్చుని ఉన్న నీలకంఠుడవూ, త్రినేత్రుడవూ అయిన నిన్ను ఎపుడు చూతునో కదా!

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాఙ్ఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమళాన్
అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ॥ 26 ॥

ఓ గిరిశ! నిన్ను చూచి, నీ దివ్యమంగళకరములైన పాదపద్మములను నా చేతులలోకి తీసుకొని, శిరమున ధరించి, కళ్ళకద్దుకొని, వక్షస్థలముపై ఉంచుకొని, కావలించుకొని, వికసితపద్మములనుబోలు పరిమళములను ఆఘ్రాణించుచూ, బ్రహ్మాదులకైనా లభించని ఆనందమును హృదయములో ఎప్పుడు అనుభవింతునో కదా!

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥ 27 ॥

ఓ గిరిశా! బంగారు కొండ నీ చేతిలో ఉంది (మేరుపర్వతము త్రిపురాసురసంహారములో శివునికి విల్లయినది). నీ సమీపమునందే ధనాధిపతి కుబేరుడున్నాడు. నీ ఇంటియందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు. సమస్తశుభములూ నీ పాదయుగళముయందు ఉన్నాయి. నేను నీకు ఏమి ఈయగలను ? నా మనస్సే నీదగుగాక.

సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్ ॥ 28 ॥

ఓ సాంబశివా, భవానీపతే, నిను పూజించునప్పుడు నాకు సారూప్యమోక్షము (శివునితో సమమైన రూపముగల ముక్తి), శివా, మహాదేవా అని సంకీర్తన చేయునప్పుడు నాకు సామీప్యమోక్షమూ (ఎల్లపుడు శివుని చెంతన ఉండగల ముక్తి), గొప్ప శివభక్తిపరుల సాంగత్యములోనూ, వారితో సంభాషణలతోనూ సాలోక్యమోక్షమూ (శివలోకప్రాప్తి అను ముక్తి), చరచరాత్మకమైన నీ ఆకారమును ధ్యానించునప్పుడు సాయుజ్యమోక్షమూ (శివైక్యం అను ముక్తి), నాకు సిద్ధించినది. ఓ స్వామీ నేను కృతార్థుడను.

(ఈ నాల్గువిధముల మోక్షములూ సాధారణముగా దేహానంతరము లభించును. కానీ శివభక్తిపరులకు ఈ లోకమునందే సిద్ధించునని ఆచార్యులు చెప్పుచున్నారు)

త్వత్పాదామ్బుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ॥ 29 ॥

ఓ ప్రభూ, నీ పాదపద్మములను పూజించుచున్నాను. ప్రతిరోజూ పరమాత్ముడవైన నిన్నే ధ్యానించుచున్నాను. ఈశ్వరుడవైన నిన్నే శరణుజొచ్చుచున్నాను. వాక్కుద్వారా నిన్నే యాచించుచున్నాను. శంభో! దేవతలు కూడా చిరకాలంగా ప్రార్థించు నీ కరుణారసదృష్టి నాపై ఉంచవయ్యా. ఓ లోకగురూ! నా మనస్సుకు ఆనందదాయకమైన ఉపదేశం చెయ్యి.

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాఞ్చనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దుచూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ॥ 30 ॥

ఓ చంద్రశేఖరా! ఓ పశుపతీ! సర్వవ్యాపకా! నీకు వస్త్రోపచారము చేయుటకు సూర్యుని వలే వేయిచేతులుండవలెను, నీకు పుష్పోపచారము చేయవలెనన్న విష్ణువు వలే సర్వవ్యాపకుడై ఉండవలెను, నీకు గంధోపచారము చేయుటయందు వాయుదేవుని వలే గంధవాహుడై ఉండవలెను, వంట చేసి నీకు హవిస్సు సమర్పించుటకు అగ్ని ముఖాధ్యక్షుడై ఉండవలెను, నీకు అర్ఘ్యపాత్రము సమర్పించుట కొరకు బ్రహ్మ వలే ఆగర్భశ్రీమంతుడై ఉండవలెను. వీరిలో ఏ ఒక్కరినీ నేను కానపుడు నీకు ఉపచారము చేయుట నా తరమా స్వామీ!




శివానన్దలహరీ (31 - 60)

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే న గిళితం నోద్గీర్ణమేవ త్వయా ॥ 31 ॥

ఓ పశుపతీ! నీ కుక్షిలోనూ వెలుపలా ఉన్న సకల చరాచరప్రాణులను రక్షించుటకొరకు, సకల దేవతలూ పారిపోవుచుండగా నిలుపుటకు భయంకరమైనదీ గొప్పఅగ్నిజ్వాలలతో నున్నదీ అగు కాలకూటవిషమును కంఠమున నుంచుకొన్నావు. మ్రింగలేదు, కక్కలేదు. నీ పరోపకారత్వమునకు ఈ ఒక్కటీ (నిదర్శనం) చాలదూ ?

జ్వాలోగ్రః సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్ ।
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ॥ 32 ॥

ఓ శంభో ! మహోగ్ర జ్వాలలతో, సమస్థదేవతలకు భయంకలిగించున్న ఆ విషం నీచే ఎలా చూడబడినది ? చేతిలో ఉంచబడ్డది. అదేమైనా మిగులపండిన నేరేడుపండా ? నాలుకయందు ఉంచబడ్డది. అదేమైనా మందుబిళ్ళా ? కంఠములో భరించబడ్డది. ఇదేమైనా ఇంద్రనీలమణి ఆభరణమా ? మహాత్మా! చెప్పవయ్యా!

నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ॥ 33॥

ఓ స్వామీ! అస్థిరులైన దేవతలను ప్రయాసకోర్చి సేవించిననూ ఏమి లభించును ? ఒక్కసారి చేయు నీ సేవకానీ, నమస్కారముకానీ, స్తోత్రముకానీ, పూజకానీ, స్మరణ కానీ, కథాశ్రవణముకానీ, దర్శనముకానీ మాబోటివారికి చాలవూ ? ఇంతకుమించి ముక్తి ఏముండును ? ఎక్కడనుండి కలుగును ? ఇంతకంటే కోరుకోవలసినది ఏమున్నది ?

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ-
ద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపఞ్చం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్దసాన్ద్రో భవాన్ ॥ 34॥

ఓ పశుపతీ! నీ సాహసమేమని చెప్పము ? నీ ధైర్యం ఎవరికి ఉన్నది ? నీవంటి స్థితి ఇతరులు ఎలా పొందెదరు ? దేవతలు పడిపోవుచుండగా, మునిగణము భయపడుచుండగా, ప్రపంచము లయమగుచుండగా, చూచుచూ, నిర్భయుడవై, ఆనందఘనుడవై ఒక్కడివే విహరించెదవు.

యోగక్షేమధురంధరస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాన్తరవ్యాపినః ।
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరఙ్గ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ॥ 35 ॥

యోగక్షేమములభారము వహించువాడవు, సకలశ్రేయస్సులనూ ఇచ్చువాడవు, ఇహపరమార్గములను ఉపదేశించువాడవు, బాహ్యమునందునా, లోపలా వ్యాపించినవాడవు, సర్వజ్ఞుడవు, దయాకరుడవు, నీ విషయమై నేను తెలుసుకొనవలసినది ఏమున్నది ? ఓ శంభో ! నీవే నాకు అత్యంత ఆత్మీయుడవని మనస్సున అనుదినమూ స్మరించుచున్నాను.

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సామ్బ తవాఙ్ఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।
సత్వం మన్త్రముదీరయన్నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ॥ 36॥

సాంబశివా! భక్తుడనైన నేను నా మనోభీష్టమైన కళ్యాణము (శుభము, మంగళము) పొందుటకు, ఈ శరీరమనే గృహము శుద్ధి కొరకై నా మనస్సనే కలశమును భక్తి అనే దారముతో చుట్టి, సంతోషము అనే ఉదకముతో నింపి, ప్రసన్నమైన ఈ కలశమునందు నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమను నారికేళమును ఉంచి, శివమంత్రమును ఉచ్చరించుచూ పుణ్యాహవాచనము చేయుచున్నాను.
ఆమ్నాయామ్బుధిమాదరేణ సుమనస్సంఘాః సముద్యన్మనో
మన్థానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।
సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ॥ 37॥

మంచిమనస్సుకలవారు (దేవతలు, పండితులు) సకలగుణసంపత్తిగల మనస్సును కవ్వముగా చేసి దృఢభక్తి అనే త్రాటితో కట్టి, వేదసముద్రమును ఆసక్తితో మథించుటద్వారా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులకు సమానమైనవాడూ (కోరినకోర్కెలు తీర్చువాడూ), బుద్ధిమంతులకు ప్రియమైన నిత్యానందమను అమృతస్వరూపుడూ, మోక్షలక్ష్మీస్వరూపుడూ, ఉమా సహితుడూ అయిన శివుని పొందుచున్నారు.

ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః ।
చేతః పుష్కరలక్షితో భవతి చేదానన్దపాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృమ్భతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38॥

కొండంత పూర్వపుణ్యము వలన దర్శనమగు అమృతస్వరూపుడు, ప్రసన్నుడు, మంగళమూర్తి, సద్గణములచే సేవించబడువాడు, లేడిని ధరించినవాడు, పూర్ణుడు, అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు, ఉమా సహితుడూ అయిన శివుడు మనోఆకాశములో అగుపించెనా, ఆనందసముద్రము ఉప్పొంగును. మంచిమనస్సుకలవారికి (సత్పురుషులకు) వృత్తి (ఆ ఆనందంలో రమించటం) అప్పుడు మొదలవుతుంది.

ధర్మో మే చతురఙ్ఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।
జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ॥ 39॥

మోక్షాధిపతి, సర్వపూజ్యుడు అగు రాజశ్రేష్ఠుడు (చంద్రశేఖరుడు) నా మనోకమలమనే నగరమునందుండగా, ధర్మము నాలుగు పాదములతోనూ బాగా నడుచుచున్నది. పాపము నశించుచున్నది. కామము, క్రోధము, మదము మొదలగునవి తొలగిపోతున్నవి. కాలము సుఖమయమవుతున్నది. జ్ఞానానందమనే గొప్ప ఔషధము బాగుగా ఫలించుచున్నది. 

ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై-
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశిదివ్యామృతైః ।
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ॥ 40॥

భగవంతుడా, విశ్వేశ్వరా! బుద్ధి అను యంత్రముద్వారా, వాక్కులనే కుండలతో, కవిత్వములను పిల్లకాలువల వరసల గుండా, నా హృదయమను పొలములోకి తీసుకురాబడిన సదాశివుని చరిత్రమను అమృతసముద్రపు జలముల వల్ల భక్తి అనే పంట బాగుగా విస్తరిస్తోంది. ! నీ భక్తుడనైన నాకు కరువు వల్ల భయం ఎక్కడిది ?  

పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్రధ్యాననతిప్రదక్షిణసపర్యాలోకనాకర్ణనే ।
జిహ్వాచిత్తశిరోఙ్ఘ్రిహస్తనయనశ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ॥ 41 ॥

ఓ మృత్యుంజయుడా! పాపములు బోయి యిష్టార్థము సిద్ధించుటకు గాను పరమేశ్వరుని స్తుతింపుమని నాలుకయు, ధ్యానింపుమని మనస్సును , నమస్కరింపుమని శిరస్సును, ప్రదక్షిణము చేయుమని పాదములును, పూజింపుమని చేతులును, చూడుమని కన్నులును, కథలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞలేనిదే ఆ కోరికలు నేనెట్లు తీర్చగలను? నీవు నాకాజ్ఞయిచ్చి పలుమారట్లు చేయువిధముగా నన్ను అనుగ్రహింపుము. ఇందు మూగతనము, మతిలేనితనము, కుంటితనము, గ్రుడ్డితనము మొదలైన ప్రతిబంధకములు ఏమియూ రాకుండా చూడుము.

గామ్భీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ-
స్తోమశ్చాప్తబలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।
విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే సదా
దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 ॥

మిగుల దుర్గమంబగు కైలాసపర్వతమున ప్రీతితో నివసించుచున్న ఓదేవా! నా మనస్సనే దుర్గములో నివసించుము. అది గాంభీర్యమనే లోతైన అగడ్త కలది, గట్టి ధైర్యమనే ప్రాకారము కలది, గుణములనే విశ్వసనీయమైన సైన్యము కలది, శరీరమునందున్న ఇంద్రియములనే ద్వారములు కలది, విద్య మరియు వస్తుసమృద్ధి అనే సమస్త సామగ్రితో నిండి దుర్గలక్షణసమగ్రంబై ఉన్నది. దుర్గప్రియుడవు కావున నీవిందు నివసించుము.

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనఃకాన్తారసీమాన్తరే ।
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ-
స్తాన్ హత్వా మృగయావినోదరుచితాలాభం చ సమ్ప్రాప్స్యసి ॥ 43 ॥
ఓ కైలాసవాసా! నీవు అటు ఇటు పోకుము నాయందే నివసించుము. ఆదికిరాతమూర్తీ! దేవా! నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగములున్నవి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొందువు.

కరలగ్నమృగః కరీన్ద్రభఙ్గో
ఘనశార్దూలవిఖణ్డనోఽస్తజన్తుః ।
గిరిశో విశదాకృతిశ్చ చేతః-
కుహరే పఞ్చముఖోస్తి మే కుతో భీః ॥ 44 ॥

సింహమునకు మృగములు చేతచిక్కుచుండును, అదేవిధంగా పరమేశ్వరుడు చేతితో లేడిని పట్టుకున్నాడు. అది వ్యాఘ్రముల ఖండించును, పరమేశ్వరుడు కూడా వ్యాఘ్రాసురుని ఖండించెను. అది గజమును సంహరిస్తుంది, పరమేశ్వరుడు గజాసురుని సంహరించెను. దాన్ని చూసి జంతువులన్నియూ కనబడకుండా పారిపోవును, పరమేశ్వరుని యందే జంతుజాలమంతయూ లయించును. ఇరువురికినీ పర్వతమే నివాసస్థలము, శరీరకాంతి తెలుపు, పంచముఖత్వము ఉభయులకూ ఉన్నది. అట్టి మహాదేవుడు సింహములాగా నాచిత్తకుహరమునందు నివసించియున్నాడు. కనుక నాకు భయమెక్కడిది?

ఛన్దఃశాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।
చేతఃపక్షిశిఖామణే త్యజ వృథాసంచారమన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ॥ 45 ॥

ఓ మనస్సనే పక్షిరాజమా! ఎందుకు అటూ ఇటూ తిరిగి వృధాగా శ్రమపడతావు? శంకరుని పాదపద్మములనే గూటిలో ఎల్లప్పుడూ విహరించుము. శాశ్వతమైన ఆ గూడు వేదములనే చెట్టుకొమ్మల చివర ఉన్న (వేదాంతము తెలిసిన) మంచి పక్షులచే (పండితులచే) ఆశ్రయించబడినది, సుఖమునిచ్చునది, దుఃఖమును పోగొట్టునది మరియూ అమృతసారం కల ఫలములతో శోభిల్లుచున్నది. అందువలన పరమేశ్వరుని పాదపద్మములవద్ద విహరించుము. 

ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవై-
రాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాఙ్ఘ్రిసౌధాన్తరే ॥ 46 ॥

పరమేశ్వరుని పాదపద్మములు ఒక భవంతిగానూ, ఆ భవంతిలో పరమహంసలు శాశ్వతవాసులై ఆ పాదపద్మములను సేవించుచున్నట్లుగానూ, మన మనస్సులనే హంసలుకూడా ఆ భవనములో‌ భక్తి భార్యతో కలిసి నివసించవలెననీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

పరమేశ్వరుని పాదపద్మములందలి నఖములు ధవళకాంతులీనుతున్నవి. (జటాజూటము నందలి) చంద్రునినుండి అమృతము స్రవించి ఆ పాదములను కడుగుచున్నది. ఆ పాదములు పద్మపువన్నె కలిగి మిక్కిలి అందముగానున్నవి. పరమహంసలు సమూహములుగా ఆ పాదములను సేవించుచున్నారు. ఓ మనస్సా! నీవునూ ఆ పరమేశ్వరుని పాదపద్మములను భక్తితో ఆశ్రయింపుము. 

శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।
దీప్యన్తే గుణకోరకా జపవచఃపుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ॥ 47 ॥

సాధారణంగా వసంతకాలం రాగానే ఉద్యానవనములలో‌ ఎండుటాకులు రాలిపోతాయి. లతలు కొత్త చిగరులు ధరించి విస్తరిస్తాయి. మొగ్గలు తొడుగుతాయి. మొగ్గలు పూలై పూల సువాసనలు నలుదిశలా వ్యాపిస్తాయి. పూదేనె స్రవిస్తుంది. ఫలాలు పక్వానికి వస్తాయి.

శంకరులంటున్నారు - నా హృదయమనే ఉద్యానవనములో‌ శంభుని ధ్యానము అనే వసంతము రాగానే, పాపములనే ఎండుటాకులు రాలిపోతున్నాయి. భక్తిలతలు విలసిల్లుతున్నాయి. పుణ్యములనే చిగురుటాకులు మొలచినవి. గుణములనే మొగ్గలు తొడిగాయి. జప,తప పుష్పాలు పూచి సుసంస్కారాల సువాసనలు వెదజల్లుతున్నాయి. జ్ఞానానందమనే‌ మకరందం ప్రవహిస్తున్నది. సంవిత్తు (సమాధి, అనుభవం) అనే ఫలం వృద్ధి చెందుతున్నది.

నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తామ్బుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యానసరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ॥ 48 ॥

హంసలు తమ నివాసముగా ఎటువంటి సరస్సులు కోరుకుంటాయి ? ఆ సరస్సులలో‌ జలములు శాశ్వతంగా ఉండాలి. జలములు స్వచ్ఛమైనవిగా ఉండాలి. పద్మములతో‌ నిండి ఉండాలి. సువాసనలు వెదజల్లుతూ‌ఉండాలి. గొప్ప హంసలు ఆ సరోవరమును నివాసముగా పొంది ఉండాలి. శంకరులు మన మనస్సులను హంసలతో‌ పోల్చి, ఆ హంసలకు పై లక్షణములున్న ఒక గొప్ప సరస్సును ఆశ్రయించమని ఉపదేశిస్తున్నారు. 

ఓ మానస హంస రాజమా! స్థిరమైన శంభుధ్యానమనే సరోవరమును చేరుము. అది శాశ్వతానందమనే జలముతో‌ నిండినది. దేవతల,మునులయొక్క మనోకమలాలకు ఆశ్రయమైనది. నిర్మలమైనది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతున్నది. పాపములు హరించునట్టిది. సుసంస్కారములనే పరిమళములు వెదజల్లునట్టిది. (ఇంత గొప్ప సరోవరము ఉండగా) ఎందుకని అల్పులను ఆశ్రయించటం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమ పడెదవు ?

ఆనన్దామృతపూరితా హరపదామ్భోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మసంవర్ధితా ॥ 49 ॥

ఒక లత బాగా పెరిగి ఫలించాలంటే మనం ఏమేమి చెయ్యవలసి ఉంటుంది ? మంచి పాదుచూసుకొని, అందులో‌ పుష్కలంగా జలం నింపాలి. లత పెరగటానికి ఆశ్రయంగా ఒక కొయ్య పాతాలి. లత విస్తరించటానికి ఒక పందిరి వెయ్యాలి. లతను ఏ కల్మషమూ ఆశ్రయించకుండా చూడాలి. ఆ లతను పోషించాలి. అప్పుడు అది ఫలాన్నిస్తుంది. శంకరులు శివభక్తిని ఒక లతగా పోల్చి, ఆ భక్తి ఎలా ఉండాలో, అది ఎలాంటి ఫలాన్నివ్వగలదో‌ ఉద్బోధిస్తున్నారు.

నా భక్తిలత శివునిపై ప్రేమ అనే జలముతో పూరింపబడినది, హరుని పాదములనే పాదునుండి పుట్టినది, స్థిరత్వమనే‌ గుంజను పట్టుకున్నది. శాఖోపశాఖలుగా విస్తరించి, మనస్సనే ఎత్తైన పందిరిని ఆక్రమించినది. నిష్కల్మషమైనది. పుణ్యకర్మలతో‌ చక్కగా వృద్ధిపొందినది. అలాంటి నా భక్తిలత నిత్యము (శాశ్వతము) అయిన అభీష్టఫలము ఇచ్చునది అగుగాక.


సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం ॥ 50 ॥

శంకరులు తాను శ్రీశైలేశుని సేవిస్తున్నానని చెబుతూ, ఆ శ్రీశైలేశుడు ఎలాంటివాడో వర్ణిస్తున్నారు.

సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో‌భ్రమరాంబాదేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.

శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పుతున్నారు (పరమాచార్యుల అమృతవాణిలో ...)

ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అందలిస్వామి మల్లికార్జునుడు. మద్దిచెట్టును మల్లెతీగ అల్లుకొన్న విధంగా మల్లికార్జునస్వామి ఉన్నాడట. ఈశ్వరుడు స్థాణువు స్థాణువైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నది అర్జునవృక్షం లేదా మద్దిచెట్టు. భ్రమరాంబికయే మల్లెతీవ. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే. 

శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వెలసి ఉన్నాడు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు. శ్రుతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తులలో వాసం చేస్తున్నాడు. భ్రమరాంబికా యుక్తుడై, ఆనందమూర్తియై, ముముక్షు హృదయవాటికలలో పరవశుడై తాండవం చేస్తున్నాడు. అట్టి శివాలింగినమైనమల్లికార్జునమహాలింగమూర్తినిసేవిస్తున్నాను - అని భగవత్పాదులవారు అంటున్నారు. 

ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది. సంధ్యారంభంలో తాండవంచేసే పరశివుని జటాజూటం విప్పుకొన్నట్లే మల్లెలూ, సాయంతసమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈశ్వరునికి శ్రుతిశిరస్థానాలు వాసమైతే, మల్లెలు నారీశిరస్థానాలను ఆక్రమించుకొంటున్నవి. భ్రమరాంబిక ఈశ్వరాన్వేషణం చేస్తే, భ్రమరములు మల్లెలను అన్వేషిస్తున్నవి. ఈశ్వరునికున్న సద్వాసన మల్లెలకున్నూ కద్దు. భోగీంద్రుడు అనగా సర్పం-శంకరునికి ఆభరణం. భోగీంద్రులకు మల్లెలు అలంకారాలు. ఈశ్వరుడు సుమనస్కులలో-దేవతలలోపూజ్యుడు. సుమనస్సులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేషస్థానం. ఈశ్వరుడు గుణావిష్కృతుడు, అనగా శుద్ధసత్త్వ గుణము కలవాడు. మల్లెలూ గుణావిష్కృతములై అనగా దారములో గ్రువ్వబడి, అందాన్నీ సౌరభాన్నీ వెదజల్లుతూ ఉంటై. ఈశ్వరుడే ఒక్క పెద్ద బొండుమల్లె! 

భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహా(ఽ)సితవపుః పఞ్చేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనో(ఽ)వనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు: ॥ 51 ॥

శంకరులు శ్రీశైలేశుడైన శివుడు ఒక గండుతుమ్మెద అని చెబుతూ, ఆ తుమ్మెదను తన మనస్సు అనే పద్మములో‌ విహరించమని పిలుస్తున్నారు. శివునికి తుమ్మెద లక్షణాలను శంకరులు ఎలా ఆపాదించారో చూడండి. 
గండుతుమ్మెద భృంగి (ఆడుతుమ్మెద) ఇచ్ఛానుసారముగా నాట్యముచేయునది. గజముయొక్క మదజలము గ్రహించునది. మాధవమాసము వలన (వసంతములోని వైశాఖము) ఆనందము పొందునది. ఝంకారనాదము కలిగినది. అసితవపుః - మహా నల్లని శరీరం కలది. మన్మధుడిచే తనకుసహాయముగా (తుమ్మెదలు మన్మధుని వింటినారి) నిశ్చయించబడినది. పూదోటలయందు ఆసక్తి ఉన్నది.

శివుడు భృంగి ఇచ్ఛానుసారముగా తాండవము చేయువాడు. గజాసురుని పీచమణచినవాడు. నారాయణుని వలన (మోహినీరూపములో) ఆనందమునొందినవాడు. ప్రణవనాదయుతుడు. సితవపుః - మహా తెల్లని శరీరం కలవాడు. మన్మధుడిచే తనలక్ష్యముగా నిశ్చయించబడినవాడు. సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి కలవాడు.

ఆ శ్రీశైలేశుడు, భ్రమరాంబా పతి, పరమేశ్వరుడు అయిన గండుతుమ్మెద నా మనస్సనే కమలములో‌ విహరించుగాక! 

కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనఃసంసేవ్యమిచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్తమయూరమద్రినిలయం చఞ్చజ్జటామణ్డలం
శంభో వాఞ్ఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 ॥

శంకరులు శంభుడిని ఒక నీలి మేఘముతో‌ పోలుస్తూ, తన మనస్సనే చాతక పక్షి ఆ శంభుడనే‌ మేఘమును ఎప్పుడూ‌ కోరుకుంటున్నది అంటున్నారు.

నీలకంఠుడా ! కారుణ్యామృతవర్షము కురిపించువాడవూ, గ్రీష్మమనే గొప్ప ఆపదను పోగొట్టగలవాడవూ, సజ్జనులచేత (దేవతలచేత) విద్య అనే పంట పండుటకై ప్రార్థించబడువాడవూ, ఇష్టం వచ్చిన రూపము ధరించుచున్నవాడవూ, భక్తులనే మయూరములను నర్తింపజేయుచున్నవాడవూ, కొండపైనున్న వాడవూ, శోభించు జటాజూటము కలవాడవూ‌ అయిన ఓ శంభో ! (జలధరమైన మేఘము వంటి)‌ నిన్ను నా మనస్సనే‌ చాతకపక్షి ఎప్పుడూ‌ కోరుకుంటున్నది. 


ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-
ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥

ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో‌ విహరించుటయందు అనురాగము కలదీ‌ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.

వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో‌ అనుగ్రహించువాడూ, పార్వతీ‌వల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.

సన్ధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక-
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చఞ్చలా ।
భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వలతాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ॥ 54 ॥

శివుడు మయూరమని చెప్పిన శంకరులు, ఆ మయూరనాట్యము జరుగు పరిస్థితులు ఏవో చెప్పుతున్నారు. ఇది శివుని ప్రదోషతాండవ చిత్రణము.

సంధ్యా సమయమే శరదాగమనము (శరదృతువు). ఆనకమనే వాయిద్యమును విష్ణుమూర్తి తన కరములతో‌ మ్రోగించగా వచ్చిన ధ్వనులే మేఘగర్జనలు. దేవతల దృష్టి పరంపరలే మెరుపులు. భక్తుల ఆనందాశ్రువుల ధారలే వృష్టి. పార్వతీదేవియే‌ ఆడునెమలి. ఇలా మహోజ్వలంగా నాట్యము చేయు (శివుడనే ) నెమలిని సేవించుచున్నాను.

ఆద్యాయామితతేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్దమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిలయోగిభిః సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 55 ॥

ఆదిదేవుడూ, జ్యోతిస్వరూపుడూ, వేదవాక్యములచేత తెలియబడేవాడూ, పొందదగినవాడూ, చిదానందమయమైన ఆత్మస్వరూపుడూ, ముల్లోకాలనూ‌ రక్షించువాడూ, సమస్త యోగులచేతనూ‌ ధ్యానింపదగువాడూ, సురగణములచేత కీర్తింపబడేవాడూ, మాయాశక్తియుతుడూ, చక్కని తాండవముచేయుచూ‌ ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే‌ నమస్కారము.




నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీశ్రేయసే
సత్యాయాదికుటుమ్బినే మునిమనః ప్రత్యక్షచిన్మూర్తయే ।
మాయాసృష్టజగత్త్రయాయ సకలామ్నాయాన్తసంచారిణే
సాయంతాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 56 ॥

నిత్యుడునూ, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడూ (సత్త్వ-రజ-స్తమో గుణములు కలవాడూ), త్రిపురాసురులను  (స్థూల సూక్ష్మ కారణ దేహములను) జయించినవాడూ, కాత్యాయనీమనోహరుడూ, సత్యస్వరూపుడూ (కాలాతీతుడూ), ప్రప్రథమ సంసారీ, మునిమనస్సులకు గోచరమగు చిత్స్వరూపుడూ, ముల్లోకములనూ మాయచే సృజించినవాడూ, వేదాన్తవేద్యుడూ, ప్రదోషతాండవముతో ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే నమస్కారము.

నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో ।
మజ్జన్మాన్తరపుణ్యపాకబలతస్త్వం శర్వ సర్వాన్తర-
స్తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షనీయోఽస్మ్యహమ్ ॥ 57 ॥

ప్రభూ! ప్రతిదినమూ, నా పొట్ట పోషించుకొనుటకు వ్యర్థముగా ధనాశతో‌ అందరివద్దకూ‌ తిరుగుతున్నాను. నిను సేవించుట తెలియకున్నాను. సర్వాంతర్యామివైన నీవు నా పూర్వజన్మల పుణ్యము ఫలించిన కారణముగానే నాయందు ఉన్నావు. ఓ‌ పశుపతీ! (ప్రపంచమునను పాలించేవాడా!)‌, ఓ‌ శర్వుడా! (పాపధ్వంసకుడా!) ఈ కారణముచేతనైనా నేను నీచే రక్షింపదగువాడను.

ఏకో వారిజబాన్ధవః క్షితినభో వ్యాప్తం తమోమణ్డలం
భిత్వా లోచనగోచరోఽపి భవతి త్వం కోటిసూర్యప్రభః ।
వేద్యః కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమ-
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ॥ 58 ॥

ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు వ్యాపించిన చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ‌ నాకు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ‌ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము.

హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలామ్బుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా ।
చేతో వాఞ్ఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ॥ 59 ॥

ఓ‌ పశుపతీ! హంస తామరకొలనును ఎలా కోరుకుంటుందో, చాతక పక్షి నల్లమబ్బును ఎలా కోరుకుంటుందో, చక్రవాకము సూర్యుని ఎలా కోరుకుంటుందో, చకోరపక్షి చంద్రుని ఎలా కోరుకుంటుందో, ప్రభూ! గౌరీ రమణా! అలాగ  నా మనసు జ్ఞానమార్గముచే వెదుకబడునదీ, మోక్షసుఖమునిచ్చునదీ అయిన నీ‌ పాదారవిందయుగళమును వాంఛించుచున్నది.

రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్ ।
దీపం సన్తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదామ్భోరుహమ్ ॥ 60॥

ఓ మనసా! నీటిలో‌ కొట్టుకుపోవువాడు ఒడ్డును ఎలా చేరుకుంటాడో, మార్గాయాసముతో‌ బాటసారి చెట్టునీడను ఎలా చేరుకుంటాడో, వర్షముచే భయపడువాడు గట్టి ఇంటిని ఎలా చేరుకుంటాడో, (ఆకొన్న) అతిథి గృహస్థును ఎలా చేరుకుంటాడో, దీనుడు ధార్మికుడైన ప్రభువును ఎలా చేరుకుంటాడో, చీకటిలో‌ చిక్కుకున్నవాడు దీపమును ఎలా చేరుకుంటాడో, చలిలో వణకువాడు అగ్నిని ఎలా చేరుకుంటాడో, అలాగ నీవునూ‌ సమస్తభయములనూ పోగొట్టి సుఖమునిచ్చు శంభుని పాదపద్మమును ఆశ్రయించుము



 శివానన్దలహరీ (61 - 100)

అఙ్కోలం నిజబీజసన్తతిరయస్కాన్తోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సిన్ధు స్సరిద్వల్లభమ్ ।
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిన్దద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ॥61॥

శంకరులు భక్తి అంటే‌ ఏమిటో నిర్వచిస్తున్నారు.

అంకోలచెట్టు విత్తనములు రాలి పడి మరల చెట్టును చేరినట్లు, సూది అయస్కాంతమును అంటుకున్నట్లు, పతివ్రత తన పెనిమిటిని అంటిపెట్టుకుని ఉన్నట్లు, లత చెట్టును పెనవేసుకుని ఉన్నట్లు, నదులు సముద్రుడిని చేరినట్లు, మనస్సు పశుపతి పాదారవిందములను పొంది, ఎల్లప్పుడూ అక్కడే ఉండుటను భక్తి అందురు.

ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం
వాచా శఙ్ఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా-
పర్యఙ్కే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥62॥

తల్లి బిడ్డడిని కాపాడినట్లు భక్తి భక్తుడిని సర్వవిధములుగానూ‌ కాపాడుతుంది అని శంకరులు ఉపదేశిస్తున్నారు.

ఓ‌ దేవా! భక్తి తల్లి, భక్తుడనే శిశువును ఆనందాశ్రువులచే ఒడలు పులకింపజేస్తుంది. నిర్మలత్వము (అనెడు వస్త్రము)చే కప్పుతుంది, మాటలనే శంఖపు ముఖమున ఉన్న నీ‌కథలనే‌ అమృతముతో‌ కడుపునింపుతుంది. రుద్రాక్షల చేతనూ, భస్మముచేతనూ శరీరమును రక్షిస్తుంది. నీ‌ భావన అనే పాన్పుపై పడుకోబెట్టి శిశువును కాపాడుతుంది.


మార్గావర్తితపాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ।
కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥63॥

శంకరులు భక్తి ఎంత గొప్పదో‌ ఉపదేశిస్తున్నారు. ఈ‌ శ్లోకం భక్తకన్నప్ప యొక్క శివభక్తి విశిష్ఠతకు తార్కాణం.

దారులుతిరిగి (అరిగిపోయిన) చెప్పు పశుపతి శరీరం (శివలింగం) తుడుచు కూర్చె అయినది. పుక్కిలినీటితో‌ తడపుట త్రిపురాసురసంహారికి దివ్యాభిషేకం అయినది. కొంచెం తిని ఎంగిలిచేసిన మాంసపుముక్క, నైవేద్యము అయినది. ఆటవికుడు భక్తశ్రేష్ఠుడయినాడు. ఓహో! భక్తి చేయలేనిది ఏమున్నది ?

వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మారసంమర్దనం
భూభృత్పర్యటనం నమస్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।
కర్మేదం మృదులస్య తావకపదద్వన్ద్వస్య గౌరీపతే
మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాఙ్గీకురు ॥64॥

గతశ్లోకములలో‌ భక్తి అనగా మనస్సు శివపాదపద్మములను వదలక పట్టుకొనుట అన్న శంకరులు, ఆ పాదపద్మములు తన మనస్సులో‌ ఉంచమని శంభుని కోరుకుంటున్నారు.

పార్వతీ‌వల్లభా! యమునిఱొమ్ము తన్నవలెను. అతికఠోర అపస్మార అసురుని అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నీకు నమస్కరించుచున్న దేవతల కిరీటముల రాపిడి ఓర్చుకోవలెను. నీ పాదములు అతి కోమలములు (అవి ఈ కఠినకార్యములు ఎలా చెయ్యగలవు ? ). శంభో! ఎల్లప్పుడూ నా చిత్తమనే మణిపాదుకలను నీపాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపుము.

## గౌరీపతే -- కిం వోచతే‌ అని పాఠభేదమున్నది


వక్షస్తాడనశఙ్కయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వలరత్నదీపకలికానీరాజనం కుర్వతే ।
దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ॥65॥

శంకరులు, శివభక్తుని మృత్యువు చేరదనీ, దేవతలు సైతం నమస్కరించెదరనీ, మోక్షము లభిస్తుందనీ‌ ఉపదేశిస్తున్నారు.

ఓ‌ భవానీ‌పతీ! ఎవని మనస్సు నీ‌ పాదపద్మములను భజించుచున్నదో, వానిని చూచి యముడు (నీవు)‌ఱొమ్మును తన్నెదవనే భయముతో‌ పారిపోవుచున్నాడు. వానికి దేవతలు తమకిరీటములనున్న రత్నములనే దీపములతో నీరాజనములిచ్చుచున్నారు. ముక్తికాంత వానిని గాఢాలింగనము చేయుచున్నది. వానికి దుర్లభమైనది ఏమున్నది ?

క్రీడార్థం సృజసి ప్రపఞ్చమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ॥ 66 ॥

శంభో! ఈ సమస్త ప్రపంచమునూ‌ ఆట వస్తువుగా సృష్టించుకొనుచున్నావు. జనులందరూ నీ‌ క్రీడామృగములే. నాచేత చేయబడే కర్మ అంతా నీ‌ ప్రీతి కోసమే చెయ్యబడుచున్నది. నా చేష్టలన్నీ‌ నీ‌ వినోదమునకే కదా! ఓ‌ పశుపతీ ! అందుచేత నన్ను రక్షించడము నీ‌ కర్తవ్యము.

బహువిధపరితోషబాష్పపూర-
స్ఫుటపులకాఙ్కితచారుభోగభూమిమ్ ।
చిరపదఫలకాంక్షిసేవ్యమానాం
పరమసదాశివభావనాం ప్రపద్యే ॥ 67 ॥
శంకరులు భగవద్భావన ఎలా ఉండాలో‌ మనకు నేర్పుతున్నారు.

అనేక విధములయిన ఆనందభాష్పముల ప్రవాహము గల రోమాంచితములు అనుభవించెడు మనోహర ప్రదేశమూ, మోక్షముకోరువారు కాంక్షించెడునట్టిదీ, సర్వోత్కృష్టమైనదీ అయిన సదాశివభావనను శరణువేడుతున్నాను.

పరమేశ్వరభావన నుండి ఆనందభాష్పములు కలుగును. శరీరము రోమాంచితమౌను. మోక్షమును కోరువారు ఈ‌ భావనను ఆశ్రయించెదరు. మనలనూ‌ పరమేశ్వరుని భావన ను ఆశ్రయించమని శంకరుల ఉపదేశము.

అమితముదమృతం ముహుర్దుహన్తీం
విమలభవత్పదగోష్ఠమావసన్తీమ్ ।
సదయ పశుపతే సుపుణ్యపాకాం
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్ ॥ 68 ॥

శంకరులు, పూర్వజన్మల పుణ్యవశాత్తూ‌ మనకు కలిగిన భక్తి ని కాపాడుకోవలెననీ, అందులకు కూడా శివుని ఆశ్రయించమనీ‌ ఉపదేశిస్తున్నారు.

పశుపతీ! అమితమైన సంతోషామృతమును మరల మరల ఇచ్చునదీ, నిర్మలమైన నీ‌ పాదపద్మములనే గోశాలయందు ఉండునదీ, (గత జన్మల)‌ పుణ్యఫలమూ అయిన నా భక్తి గోవును దయతో కాపాడుము.


జడతా పశుతా కలఙ్కితా
కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ ।
అస్తి యది రాజమౌలే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ॥ 69 ॥

శివుడు భక్తవశంకరుడనీ, భోళాశంకరుడనీ, భక్తసులభుడనీ, భక్తులదోషములు ఎంచని ఆర్తత్రాణ పరాయణుడనీ‌ శంకరులు ఉద్బోధిస్తున్నారు. ఎలాంటి పాపులైనప్పట్టికీ‌ శివాశ్రయముచే‌ తరించగలరని అభయమిచ్చుచున్నారు.

పరమేశ్వరా! నాకు జడత్వము, పశుత్వమూ, కళంకమూ, కుటిలత్వమూ లేవు. ఓ‌ చంద్రశేఖరా! ఒకవేళ ఈ గుణాలు నాకు ఉండి ఉంటే, నీ‌కు ఆభరణమయ్యేవాడను కానూ ?

జడత్వము (జలత్వము), పశుత్వము, కళంకమూ, వంకరనడత - ఇవి చంద్రుని లక్షణములు. అలాంటి చంద్రునే‌ శిరోభూషణముగా ధరించిన చంద్రశేఖరుడు మనకు కూడా ఆశ్రయమియ్యగలడని అన్వయము.

జడత్వము (జలత్వము)‌ గల గంగనూ, పశుత్వము గల లేడినీ, కళంకము గల చంద్రునీ, కుటిలచరత్వముగల సర్పమునూ‌ ఆభరణములుగా ధరించిన చంద్రశేఖరుడు మనకు కూడా ఆశ్రయమియ్యగలడని మరొక అన్వయము.

అరహసి రహసి స్వతన్త్రబుద్ధ్యా
వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః ।
అగణితఫలదాయకః ప్రభుర్మే
జగదధికో హృది రాజశేఖరోఽస్తి ॥ 70 ॥

శివపూజనము చాలా సులువైనదనీ, ఫలితము లెక్కపెట్టలేనంతదనీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

బహిఃప్రదేశమునందు గాని, మనస్సునందు గాని చనువుతో‌ పూజచేయుటకు సులభుడూ, ప్రసన్నమూర్తీ, అసంఖ్యాకమైనన్ని ఫలములను ఇచ్చువాడూ, జగత్తుకు అతీతుడూ, ఈశ్వరుడూ అయిన చంద్రశేఖరుడు నా హృదయములో‌ ఉన్నాడు.

ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప
యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః
సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥ 71 ॥

రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.

భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.

ధ్యానాఞ్జనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వరనామమన్త్రైః ।
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి
యే పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః ॥ 72 ॥

భూగర్భములో‌ కొన్ని నిధులు దాగి ఉంటాయి. ఆ నిధులను కొన్ని శక్తులు ఆశ్రయించి ఉంటాయి. సర్పములు వాటిని చుట్టుకొని ఉంటాయి. అలాంటి నిధులను అంజనము (ఒకానొక కాటుక) ద్వారా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొంటారు. ఆ నిధిని ఆశ్రయించి ఉండు శక్తులకు బలులు సమర్పించుట ద్వారా ప్రసన్నం చేసుకొని, అచ్చోట భూమిని త్రవ్వి ఆ నిధిని పొందుతారు.

శంకరులు శివపాదపద్మమే‌ భక్తులు పొందదగిన నిధి అంటూ అది పొందు విధానం ఉపదేశిస్తున్నారు.

శివా! నీ ధ్యానమనే అంజనముతో‌ బాగుగా చూచి, నీ నామములు, మంత్రములనే ఉత్తమబలులతో‌ అజ్ఞానమనే భూమిని భేదించి, దేవతలచే‌ ఆశ్రయించబడునదీ, సర్పాభరణము కలదీ‌ అయిన నీ‌ పాదపద్మమును ఈ‌జన్మలో పొందుతున్నవారు కృతార్థులు.

భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ-
భూదార ఏవ కిమతః సుమతే లభస్వ ।
కేదారమాకలితముక్తిమహౌషధీనాం
పాదారవిన్దభజనం పరమేశ్వరస్య ॥ 73 ॥

విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి,భూదేవి భార్యలుగా కలవాడు. అలాంటి విష్ణువు ఏమి కోరుకుంటాడు ?‌ విష్ణువు కూడా సేవించు శివ పాదపద్మములను మనలనూ సేవించమని శంకరులు ఉపదేశిస్తున్నారు.

శ్రీ మహాలక్ష్మి,భూదేవి దేవేరులైన విష్ణువే ఏమి కోరి వరాహరూపము ధరించెను ? (ఈశ్వర పాదారవింద దర్శనాపేక్షచే). కాబట్టి, ఓ బుద్ధిమంతుడా, నీవునూ (వివిధములు గా చెప్పబడే) మోక్షములు అనే ఓషధులు పండు పొలము అయిన పరమేశ్వర పాదారవిందముల సేవను పొందుము.

జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

ఆశాపాశక్లేశదుర్వాసనాది-
భేదోద్యుక్తైర్దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ॥ 74 ॥

నా మనస్సులో‌ పరమేశ్వరపాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకరులు కోరుతూ, అపుడేమగునో‌ అన్యాపదేశంగా చెప్పుతున్నారు.

నా మనస్సు నందు ఆశాపాశములూ, క్లేశములూ, దుర్వాసనలూ (చెడు సంస్కారములు)‌ ఉన్నాయి. సాంబసదాశివుని పాదారవిన్దము నా మనస్సు యొక్క ఈ‌లక్షణాలు పోగొట్టి, దివ్యములూ, విస్తారములూ‌ అయిన పరిమళముల(సుసంస్కారములు) చేత నిండినదానిగా చేయుగాక.

పద్మములు సుగంధములు వెదజల్లి, చెడు వాసనలు దూరం చేయునట్లు, పరమేశ్వరుని పాదపద్మములు చెడు సంస్కారములను దూరం చేయునని భావము.

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - ఇవి పంచక్లేశములు.

కల్యాణినాం సరసచిత్రగతిం సవేగం
సర్వేఙ్గితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్ ।
చేతస్తురఙ్గమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ॥75 ॥

శంకరులు మనస్సును ఉత్తమాశ్వముతో‌ పోలుస్తూ, సమస్తలోకములకూ‌ ప్రభువైన పరమేశ్వరుడను వృషభవాహనము బదులు ఈ‌ అశ్వమును యెక్కి సంచరింపమంటున్నారు. భక్తి నిండియున్న మనస్సుకూ‌ ఉత్తమాశ్వమునకూ‌ పోలిక ఎలా చెప్పారో చూడండి. చెప్పబడిన ప్రతీ లక్షణమూ అశ్వమునకూ, భక్తిపూరిత మనస్సునకూ‌ వర్తిస్తుంది.

వృషభవాహనుడా! మన్మధుని శత్రువా! జగదాధీశుడా! కల్యాణ లక్షణములు కలదీ, యజమానుడియందు అనురాగముకలిగి చిత్ర గతులలో‌ పోగలదీ, మిగుల వేగముకలదీ, అందరి అభిప్రాయము తెలిసికొనగలదీ, దోషములు లేనట్టిదీ, స్థిరలక్షణములు కలిగినదీ‌ అయిన నా మనస్సనే అశ్వమునెక్కి సంచరింపుము.

సదా నా మనస్సునందు ఉండమని భావము.

భక్తిర్మహేశపదపుష్కరమావసన్తీ
కాదమ్బినీవ కురుతే పరితోషవర్షమ్ ।
సమ్పూరితో భవతి యస్య మనస్తటాక-
స్తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాఽన్యత్ ॥ 76 ॥

ఎవరి జన్మ సఫలము ? శంకరులేంచెబుతున్నారో‌ చూడండి.

భక్తి మేఘము పరమేశ్వరుని చరణాకాశమును ఆశ్రయించి ఆనందవర్షము కురిపించుచున్నది. (ఆ వర్షానికి)‌ ఎవ్వని మనో‌తటాకము (మనస్సనే చెరువు)‌ నిండిపోతుందో‌ వాని జన్మము అనే‌ పైరు మొత్తము సఫలము. ఇతర జన్మములు సఫలములు కావు.

భగవంతుని పాదములపై భక్తి చేతనే ఆనందప్రాప్తి తద్వారా జన్మ సాఫల్యమూ‌ సాధ్యమని శంకరుల ఉపదేశము.


బుద్ధిఃస్థిరా భవితుమీశ్వరపాదపద్మ-
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరన్తీ ।
సద్భావనాస్మరణదర్శనకీర్తనాది
సంమోహితేవ శివమన్త్రజపేన విన్తే ॥ 77 ॥

శంకరులు భగవద్భక్తుల లక్షణములు వివరిస్తున్నారు.

పరమేశ్వరా! నా బుద్ధి నీ‌ పాదపద్మమందు ఆసక్తి ఉన్నదై , భర్త యెడబాటు కలిగిన భార్యవలే , స్థిమిత పడుటకు సదా ధ్యానము చేయుచూ, శివమంత్రజపముతో‌ మోహముపొందినదై (బాహ్య ప్రపంచమునకు చెందిన విషయముల) భావన, స్మరణ, చూపు, సంభాషణ పొందుటలేదు.

భక్తి పారవశ్యమువలన భగవంతుని విడివడి ఉండలేకుండుట. భగవద్విరహము. భగవంతునిపై పిచ్చి ప్రేమ.

సదుపచారవిధిష్వనుబోధితాం
సవినయాం సహృదయం సదుపాశ్రితామ్ ।
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ ॥ 78 ॥

ప్రభూ! పూజావిధానములయందు బాగుగా శిక్షణ పొందినదీ, వినయ సంపన్నురాలూ, మంచి మనస్సును ఆశ్రయించి ఉన్నదీ అయిన నా బుద్ధిని నూతన వధువువలె, సద్గుణములను ఉపదేశించి ఉద్ధరింపుము.

నిత్యం యోగిమనః సరోజదలసఞ్చారక్షమస్త్వత్క్రమః
శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షఃకవాటక్షతిః ।
అత్యన్తం మృదులం త్వదఙ్ఘ్రియుగలం హా మే మనశ్చిన్తయ-
త్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే ॥ 79 ॥

శంకరులు శంభుని పాదస్పర్శకై ప్రార్థిస్తున్నారు.

శంభో! నీ‌ పద విన్యాసము అనునిత్యమూ యోగుల మనస్సులనే‌ తామరపూల రేకుల యందు సంచరించునది. ఆ పాదముతో‌ కఠోరమైన వాకిలి వంటి యముని వక్షము ఎలా తన్నబడినది ? అయ్యో! అత్యంత మృదులైన నీ‌ పాదయుగళము గూర్చి నా మనస్సు చింతించుచున్నది. నీ‌ పాదయుగళమును ఈ‌ నేత్రములకు కనుపించునట్లు చేయుము. నేను చేతితో నొప్పి పోవునట్లు ఒత్తెదను.


ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి మ-
ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః ।
నోచేద్దివ్యగృహాన్తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ॥ 80 ॥

శంభో! "ఈ మనుష్యుడు జన్మించెదడు. వీని మనస్సు కఠినము, అందు నేను సంచరించవలెను" అని భావించి, నా మనస్సున ఉండి నన్ను రక్షించుటకొరకై నీవు నీ‌ సుతిమెత్తని పాదములు (కఠినమైన)‌ కొండపై ఉంచుట ముందుగానే అభ్యసించినావు. అటు కానిచో‌ దివ్య భవనములు, పూపాన్పులు, యజ్ఞవేదికలు ఎన్నో‌ ఉండగా, శిలలపై నీకు తాండవము ఎందుకు ? 

కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।
కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్స ముక్తః ఖలు ॥ 81 ॥

శంకరులు జీవన్ముక్తులు అనగా ఎవ్వరో‌ చెప్పుచున్నారు.

ఉమామహేశ్వరా! కొంచెము సేపు నీ‌ పాదపద్మములను పూజించుటలోనూ, కొంచెము సేపు నీకు నమస్కారములు చేయుటలోనూ, కొంచెము సేపు నీ‌ధ్యానము లోనూ, సమాధిలోనూ, కొంచెము సేపు నీ‌ కథలను వినుటలోనూ, కొంచెము సేపు నీ‌ దర్శనములలోనూ, కొంచెము సేపు నిన్ను స్తుతించుటలోనూ, ఈ‌ విధముగా సంతోషముగా నీకు మనస్సర్పించిన స్థితిని చేరినవాడు జీవన్ముక్తుడు.

శంకరులు ఈ శ్లోకముద్వారా మనస్సును బాహ్యవిషయములపై నిలుపక నిరంతర భగద్విషయ నిమగ్నము అవవలెనని ఉపదేశిస్తున్నారు. కేవలం ఒకే విషయముపై మనస్సు నిశ్చలముగా ఉండుట దుస్సాధ్యము కాబట్టి, జపధ్యానాది బహువిధ భగవత్సంబంధ కర్మలను ఆచరించవలెనని ఉపదేశిస్తున్నారు.

ఉమామహేశ అనే సంబోధన ద్వారా ఇరువురినీ‌ సేవించాలని సూచితము.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదఙ్గవహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదాన్యోఽధికః ॥ 82 ॥

పార్వతీ‌పతీ! హరి (త్రిపురాసురసంహారమున) నీకు బాణము అయినాడు. వృషభరూపములో‌ నీకు వాహనము అయినాడు. నారాయణియై అర్థశరీరముతో‌ నీకు భార్య అయినాడు. నీ‌ పాద దర్శనమునకై వృషభరూపము దాల్చినాడు. నీకు మిత్రుడు అయినాడు. నీ తాండవవేళ మృదంగము వాయించువాడు అయినాడు. నీ పాదములయందు తన నేత్రమును సమర్పించినాడు (శివుని సహస్రకమలపూజలో‌ ఒక కమలము తక్కువ అవగా, విష్ణువు తన కంటినే పూవుగా సమర్పించినాడని పురాణగాధ). నీ‌ శరీరమందు ఒక భాగముగానే‌ వర్తించినాడు. అందుచేతనే పూజ్యులచేతకూడా పూజింపబడినవాడు అయినాడు. కానిచో, వానికంటే శ్రేష్ఠుడు ఎవరున్నాడు ?
శివుని అమితముగా సేవించుట చేతనే విష్ణువుకు సర్వపూజ్యత్వం లభించిందని భావం.

జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృతరూపం సామ్బమీశం భజన్తే
య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభన్తే ॥ 83 ॥

జనన మరణములు కల దేవతలను పూజించుటచే‌ కొంచెము కూడ సుఖము కలుగదు. ఈ‌ విషయములో‌ సందేహము లేదు. పుట్టుట, గిట్టుట లేనివాడూ, అమ్మవారితో కలసి ఉన్నవాడు అయిన పరమేశ్వరుని ఎవ్వరు ఈ‌ లోకముననే పూజించెదరో వారు ధన్యులు, మోక్షమును పొందెదరు.


శివ తవ పరిచర్యాసన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకలభువనబన్ధో సచ్చిదానన్దసిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ॥ 84 ॥

శివా! సకల లోక బంధువా! సచ్చిదానంద సముద్రుడా! భవా! గౌరీదేవితో‌ కలసి నీవు దయతో నా హృదయగృహంలో ఎప్పటికీ నివసింపుము. మీకు సపర్యలు చేయుటకై గుణవంతురాలగు నా బుద్ధి కన్యను ఇచ్చెదను.

శివ (మంగళము, సౌభాగ్యము), భవ (ఉత్పాదకత్వం), సకలభువనబంధు, సచ్చిదానందసింధు, సదయ - ఈ‌ శబ్దములతో‌ శంకరులు తమ బుద్ధి కన్య యొక్క వరుని (శివుని) గుణములను చూపుతున్నారు.


జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ॥ 85 ॥

శివుడు క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషమును నేరేడుపండువలే తినినవాడు. ఆ మథనంలో‌ ఉద్భవించిన చంద్రుని శిరముపై పువ్వువలె ధరించినవాడు. పాతాళలోకమునందుండు సర్పములు ఆయనకు భూషణములు. అడవిఏనుగు చర్మము ఆయన ధరించే వస్త్రము. శివునికి తగిన పరిచర్యలు పూజలో తాము చేయలేమని శంకరులంటున్నారు.

చంద్రశేఖరా! నీకు ఆహారము, పుష్పము, ఆభరణము, వస్త్రములతో‌ కూడిన పూజను నేను ఏ విధముగా చేయగలను ? నేను సముద్రమథనము చేయుటకు సమర్థుడను కాను. కాబట్టి కాలకూటవిషము ఆహారముగానూ, చంద్రుని కుసుమముగానూ‌ ఈయలేను. పాతాళమును భేదించలేను. కాబట్టి సర్పములు ఆభరణముగా తేలేను. అడవిలో‌ మృగములను వేటాడుటకు బోయవాడను కాదు. కాబట్టి గజచర్మము ఆభరణముగా సమర్పించలేను. ఏమి చేయను ?

భావనామాత్రసంతుష్టాయై నమోనమః - సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః...

పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥

శంకరులు, పూజాద్రవ్యములున్ననూ పూజచేయుట కష్టమే‌ అని అంటున్నారు. దిగంతాలు వ్యాపించియున్న స్థాణుస్వరూపమును భావన ఎటుల చేసేది ?

ఉమాపతీ ! పూజాద్రవ్యములన్నియూ విశేషముగా సమకూర్చబడినవి. కానీ పూజ ఎట్లు చేయుదును ? దుర్లభమైన హంస వరాహ రూపములు నేను పొందలేను. కాబట్టి నాకు నీ‌ శిరస్సు, పాదపద్మములు తెలియవు. ప్రభో! ఆ రూపములు ధరించిన బ్రహ్మ, విష్ణువుల చేతనే యదార్థము తెలిసికొనబడలేదు. (వారూ‌ తెలిసుకొనలేకపోయారు). నేనెంత ?
జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదామ్బుజభక్తిమేవ దేహి ॥ 87 ॥

శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి యెద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక భక్తిమాత్రమే కోరదగిన వస్తువు అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

యదా కృతాంభోనిధిసేతుబన్ధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః ।
భవాని తే లఙ్ఘితపద్మసంభవః
తదా శివార్చాస్తవభావనక్షమః ॥ 88 ॥

శివార్చన, స్తుతి, ధ్యానము సాధారణవిషయములు కావని శంకరులు ఉగ్గడిస్తున్నారు.

ఓ‌ శివా! ఎప్పుడు నేను - సముద్రమునకు సేతువుగట్టినవాడనూ (శ్రీరాముని వంటి వాడను), అఱచేతితో‌ పర్వతరాజమును అణచినవాడను (అగస్త్యుడు వింధ్యాచలమును అణచెను, అటువంటివాడను), బ్రహ్మనుమించినవాడనూ అవుతానో‌ అపుడు నేను నిను పూజించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు సమర్థుడనవుతాను.
నతిభిర్నుతిభిస్త్వమీశపూజా-
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥

శంకరులు శివుడు భోళాశంకరుడని, భక్తసులభుడని ఈ శ్లోకములో‌ చూపుతున్నారు.

ఈశ్వరా! నీవు నమస్కారములచేతనూ, స్తుతిచేతనూ, పూజావిధులచేతనూ, ధ్యాన సమాధులచేతనూ సంతోషించుటలేదు. నీకు (పూజ)‌ధనుస్సుతోనా , రోకలితోనా, రాళ్లతోనా ?‌ నీకు ఏది ప్రీతియో‌ చెప్పుము, అటులనే చేసెదను.

అర్జునుడు ధనుస్సుతోనూ, రాళ్లతోనూ‌ ఇతర రీతులనవలంబించి శివునితో‌ పోరాడెను. కానీ‌ శివుడు ప్రసన్నుడాయెను, పాశుపతము ఉపదేశించెను. శివభక్తులు (నాయనార్లు) శివుని రోకటితోనూ, రాళ్లతోనూ కొట్టితిరనీ, వారిని శివుడనుగ్రహించెననీ‌ గాధ.

సాధారణ (బాహ్య పటాటోపాల) సాత్వికపూజా విధానములు భక్తి పండనిచో శివుని మెప్పించలేవు. భక్తి పండిన చోట శివుడు సర్వదా ప్రసన్నుడనీ‌ శంకరుల ఉపదేశము. 

వచసా చరితం వదామి శంభో-
రహముద్యోగవిధాసు తేఽప్రసక్తః ।
మనసా కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥

శంభో! నేను శాస్త్రవిధిన నిన్ను పూజించుట తెలియనివాడను. నోటితో నీ చరిత్ర పలుకుతాను. మనస్సులో ఈశ్వరుని స్వరూపము ధ్యానించుతాను. సదాశివుని శిరస్సుతో‌ నమస్కరించుతాను.

త్రికరణశుద్ధిగా శివుని సేవించుట ముఖ్యమని శంకరుల ఉపదేశము.

ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీ-
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌళే  ॥ 91 ॥

చంద్రశేఖరా! నీ‌ అనుగ్రహము వలన అనాదిగా నా హృదయమందున్న అజ్ఞానము నాశనమాయెను. హృద్యమైన (అందమైన, మనోహరమైన) జ్ఞానము హృదయమున ఉన్నది. అనుదినమూ శ్రీకరమూ, మోక్షప్రదమూ అగు నీ‌ పాదపద్మములను నేను మనస్సున ధ్యానించుచున్నాను.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, మనస్సుద్వారా చేయవలసిన శివపాదపద్మ ధ్యానము ఉపదేశిస్తున్నారు.

దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి ।
సారం త్వదీయచరితం నితరాం పిబన్తం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః  ॥92 ॥
గౌరీనాథా! పాపములు, చెడు అక్షరములతో‌ కూడినవి, దౌర్భాగ్యము-దుఃఖము-దురహంకారము కలవీ అగు చెడు వాక్కులు తొలగిపోయినవి (విడచిపెట్టితిని). వేదసారమైన నీ‌ చరిత్రమును నిత్యమూ పానము చేయుచున్న నన్ను ఈ జన్మలో‌ నీ‌ కటాక్షములతో ఉద్ధరింపుము. 

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, వాక్కుద్వారా చేయవలసిన శివకథా పఠనము ఉపదేశిస్తున్నారు.

సోమకలాధరమౌళౌ
కోమలఘనకన్ధరే మహామహసి ।
స్వామిని గిరిజానాథే
మామకహృదయం నిరన్తరం రమతామ్  ॥93 ॥

శివుని సాకారధ్యానం శంకరులు ఉపదేశిస్తున్నారు.

శిరస్సున చంద్రకళ ధరించినవాడూ, కోమలమైన నల్లమబ్బువంటి కంఠము కలవాడూ, గొప్ప తేజోరూపుడూ, ప్రభువూ అగు గిరిజానాథునియందు నా హృదయము ఎల్లప్పుడూ రమించుగాక.

సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి  ॥ 94 ॥

శివుని గురించి పలికెడి నాలుకయే‌ నాలుక. శివుని దర్శించు కన్నులే‌ కన్నులు. శివుని అర్చించు కరములే‌ కరములు. శివుని ఎల్లప్పుడూ‌ స్మరించువాడే కృతకృత్యుడు (ధన్యుడు). 

ప్రహ్లాదుడు "కమలాక్షునర్చించు కరములు కరములు" అన్నటులే. త్యాగరాజులవారు "ఎన్నగ మనసుకు రాని" అన్నటులే. భగవత్ప్రసాదిత శరీరమూ, ఇంద్రియములచే భగవత్సంబంధిత కార్యములు చేయించుటయే వాటికి కృతకృత్యత.

అతిమృదులౌ మమ చరణా-
వతికఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా వేశః  ॥ 95 ॥

పార్వతీపతీ! " నాపాదములు అతి కోమలములు, నీ‌ మనస్సు అతి కఠినము" అనే సంశయమును విడిచిపెట్టు. శివా! అలా అయితే, పర్వతమందు ఎట్లు సంచరించినావు ? 
పర్వతమందు సంచరించు నీ పాదములు నా మనస్సు కఠినమైననూ అందు సంచరించగలవు కాబట్టి శీఘ్రమే‌ నా మనస్సు నందు నీ‌ పాదపద్మములను ఉంచమని శంకరుల ప్రార్థన. 

ధైర్యాఙ్కుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృఙ్ఖలయా ।
పురహర చరణాలానే
హృదయమదేభం బధాన చిద్యన్త్రైః ॥ 96 ॥

మదపుటేనుగును అదుపులోకి ఎలా తెచ్చుకుంటాము ?‌ అంకుశంతో  కదలకుండా చెయ్యాలి. గొలుసుతో‌ బలంగా లాగి, పనిముట్ల సహాయముతో, గట్టి స్థంభానికి కట్టి వేయాలి. మనస్సు మదించిన ఏనుగు వంటిది. దానిని అదుపులోకి తెచ్చుకుని కట్టివేయుట ఎట్లు ? శంకరుల ఉపదేశం -

భగవద్వాక్యములు, శాస్త్రవాక్యముల వలన వచ్చిన ధైర్యము అను అంకుశము వలన కదలకుండా చేయబడిన మనస్సు అనే‌ యేనుగును - భక్తి అనే గొలుసుచేత బలముగా లాగి - ఈ‌శ్వరలీలావిశేషముల పరిజ్ఞానములు అను పనిముట్లతో‌ - త్రిపురాసురసంహారి పాదములనే స్తంభమునకు - కట్టివేయుము.

ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనః కరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ॥ 97 ॥

భక్తితో మనస్సును బంధించమని శంకరులు మరలా ఉపదేశిస్తున్నారు.

మనస్సనే‌ ఈ‌ బలిష్ఠమైన మదపుటేనుగు అడ్డులేక అంతటనూ తిరుగుతున్నది. దృఢమైన ఈ యేనుగును భక్తి త్రాటితో యుక్తిగా బంధించి బ్రహ్మపదమును (పరమేశ్వరుని పాదమును) చేర్చుము.

సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ॥ 98 ॥
శంకరులు తమ కవితాకన్యకను శివునికి అర్పిస్తున్నారు.

గౌరీవల్లభా! కల్యాణి అయిన నా కవితాకన్యకను నీవు స్వీకరింపుము. ఈమె సర్వాలంకారములు కలది, సరళమైన పదములు కలది, మంచి నడవడిక కలది, మంచి వర్ణము కలది, బుద్ధిమంతులచే పొగడబడునది, సరసగుణములున్నది, సులక్షణములు కలది, ప్రకాశించు ఆభరణములు కలది, వినయము కలది, స్పష్టమైన అర్థరేఖ కలది.

ఈ శుభ కన్యకా లక్షణములు, శంకరుల కవితాకన్యకకూ‌ వర్తించునట్లు కావ్యాలంకారం. 

ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోఽసి పురతః ॥ 99 ॥

పరమశివా! కరుణాసముద్రుడా! ఇది నీకు తగునా ? నీ‌ పాదపద్మములు, శిరస్సు చూచుటకై హరి, బ్రహ్మలు జంతురూపములు ధరించి భూమిలోనూ‌ ఆకసములోనూ సంచరించి శ్రమచెందిరి. ప్రభూ! శంభో! నాకు ఎలా అగుపించెదవో చెప్పుము. 

శివుడు భక్తపరాధీనుడు కాబట్టి విష్ణుబ్రహ్మలకూ కన్పడని తన స్వరూపం భక్తులకు దర్శనము చేయునని ఉపదేశం.

స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరిఞ్చాదయః
స్తుత్యానాం గణనాప్రసఙ్గసమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ-
ద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః ॥ 100 ॥

శంభో! స్తోత్రము చాలు. నేనబద్ధము చెప్పను. బ్రహ్మాదిదేవతలు, స్తుతించతగినవారిని లెక్కించునప్పుడు నీవు అగ్రగణ్యుడవని తెలిసికొనుచున్నారు. మహాత్మ్యములో గొప్పవారిని గూర్చి విచారించునప్పుడు , వారు తుచ్ఛధాన్యపుపొట్టు రాశి వలె ఎగురబట్టబడుతున్నారు. నీ భక్తులు నిన్ను సర్వోన్నత ఫలముగా తెలుసుకొనుచున్నారు.

https://jagadguru-vaibhavam.blogspot.com/2016/07/blog-post_30.html sekarinchinadi