Monday, December 14, 2015

శివపురాణము--33


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కృష్ణ భగవానుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒకమాట అంటున్నాడు. “అయ్యా, మహానుభావా, నీకు తెలియని విషయం లేదు. ఇంతకు పూర్వం మేము రాజసూయ యాగం చేశాము. మాచేత ఓడింపబడని రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసమునకు వచ్చాము. అనగా ఓడలు బండ్లు అయ్యాయి. ఇప్పుడు మాకు శత్రువులు అనంతము. ఈశ్వరా, మేము ఈ సంకటం నుండి ఎలా బయటపడతాము? అన్నాడు. ఇదీ మీకు పెద్దలు కనపడినపుడు మీరు అడగవలసిన మాట. ధర్మరాజుగారు ప్రాజ్ఞుడు. మాకు ఇన్ని ఉన్నాయి అనడం లేదు. శత్రు బలమును ఎక్కువచేసి చెప్తున్నాడు. ధర్మరాజు అలా అడిగిన మీదట కృష్ణుడు ‘ఎందుకయ్యా నువ్వు బెంగ పెట్టుకుంటావు? నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు. నేను పరమశివుడిని ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను. మహానుభావుడు దీన దయాళువు ఎవరి పేరు శివుడో, ఎవడు మంగళము లన్నిటికీ కూడా ఆలవాలమో, ఎవరి అనుగ్రహం మంగళములను ఇస్తుందో, ఎవరు చెయ్యెత్తి ఆశీర్వదిస్తే నీకు శుభం జరుగుతుందో, ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నీవు బెంగ పెట్టుకోనవసరం లేదో అటువంటి పరమశివుని గురించి తపస్సు చేయండి. ఆ శంకరుడు కానీ కృపాళుడై మిమ్మల్ని అనుగ్రహించాడంటే ఎంతమంది శక్తిమంతులు అటుపక్కన నిలబడిన మీకిక ఎదురు ఉండదు. మీరు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి మీరు శివానుగ్రహమును పొందండి” అని చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు వ్యాసభగవానుడు అక్కడికి వచ్చాడు. ఆయన సాక్షాత్తు నారాయణుడు. అపుడు పాండవులు అర్ఘ్య పాద్యాదులు యిచ్చి నమస్కరించి పూజించారు. తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయా జూదంలో ఓడించారు. దుర్యోధనుడు మమ్మల్ని ఇలా అరణ్యవాసమునకు తరువాత అజ్ఞాత వాసమునకు వెళ్ళేటట్లుగా చేశాడు. మేము కృష్ణ భగవానుని ఆరాధన చేశాము. ఆయన మమ్మల్ని శంకరుని పూజ చేయమని ఆనతిచ్చాడు. మహాత్మా ఇవాళ మీరు వచ్చారు. మేము ఈ కష్టంలో ఉన్నాము. ఇదే విషయమును మీకు కూడా చెప్పుకుంటున్నాము’ అన్నారు. ఆ తరువాత ద్రౌపది మాట్లాడింది. ‘నేను ధర్మమునందు ఉన్నాను కాబట్టి మీ ఆశీర్వచనం నాకు కావాలి’ అని వ్యాసులవారితో అన్నది. తనకి జరిగిన పరాభవం గురించి చెప్పింది. ఇది చెప్పగానే వ్యాసుడి మనస్సు చిన్నబుచ్చుకుంది. నీవు శాసించగలిగిన వాడివి, నీకు ఎదురు తిరిగితే శాపవాక్యం విడిచి పెట్టగలిగిన వాడివి. అంది. కానీ శాపం ఇవ్వవలసిందని ఆవిడ అడగలేదు. ఈ విషయములను చెప్పిన తర్వాత ఇపుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు. ఇది పాండవుల ఉన్నతికి పనికొస్తుంది. తన కష్టం చెప్పి తన భర్తలను గెలిపించుకుంది. చేతకానివారై తనను ఎన్నో కష్టములు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. కౌరవులు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో చెప్పి, ఆయన సలహా చేత భర్తలను రక్షించుకుంది. ఇదీ మహా పాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుంది.
అపుడు వ్యాసభగవానుడు ‘అటు కౌరవులూ నా వాళ్ళే, మీరూ నా వాళ్ళే. కానీ ధర్మము మీ పట్ల ఉన్నది. కాబట్టి నా అనుగ్రహం మీకే ఉంటుంది. దానివలన మీరు గెలుపొందుతారు’ అని చెప్పాడు. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి ఇపుడు పాండవమధ్యముడయిన అర్జునుని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదికి పంపించండి. అక్కడ శంకరుని గూర్చి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగులేదు. అని చెప్పి వ్యాస భగవానుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు.
అర్జునుడు అన్న దగ్గర, తమ్ముళ్ళ దగ్గర శలవు తీసుకుని బయల్దేరాడు. ఇంద్రకీలాద్రి చేరుకుని శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుని తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ‘దేనికి తపస్సు చేస్తున్నావయ్యా?” అని అడిగాడు. శంకరుని అనుగ్రహం కోసం చేస్తున్నట్లు చెప్పాడు అర్జునుడు. నీకేం కావాలి? అని వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు ఆర్జునుడిని అడిగాడు. నాకు పాశుపతాస్త్రం కావాలి’ అన్నాడు. ఆయన నవ్వి ‘శంకరుడు మహాజ్ఞాని. శంకరుని అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి. అపుడు ఈ యుద్ధములు, గొడవలు అవేమీ మీకు ఉండవు. కానీ యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఎవరికయినా ఇంత తెలివితక్కువతనం ఉంటుందా! అన్నాడు. ఇపుడు ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్ర ధర్మమును విడిచిపెట్టేశాడా అని చూస్తున్నాడు. ప్ర్జునుడు అపుడు నాకేమి కావాలో తెలుసు. మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతం తెమ్మనమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకొక నమస్కారం, వెళ్ళిరండి’ అన్నాడు. అయినా వెళ్ళకుండా వేధిస్తున్నాడు ఇంద్రుడు. ఇంక నన్నుగాని విసిగించావంటే నీకు శాస్తి జరుగుతుంది. ఇక్కడనుండి పో అన్నాడు. ఇపుడు ఇంద్రుడు సంతోషించాడు. తన నిజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరీ మంత్రముతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. నీ క్షాత్రధర్మమును మాత్రం మరిచిపోకు. అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని అర్జునుడు శివుని గూర్చి ఘోరమయిన తపస్సు మొదలుపెట్టాడు.
శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. మూకాసురుడు అనే ఒక రాక్షసుడిని పిలిచి ‘నీవు ఒక బ్రహ్మాండమయిన అడవి పందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రొద చెయ్యి అన్నాడు. అది అక్కడికి వెళ్లి పెద్ద చప్పుడు చేస్తోంది. ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వీడెవడో రాక్షసుడు అయి ఉంటాడు. కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు. అని ధనుస్సును అందుకున్నాడు. శివుడు అర్జునుడికి వెనక ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అర్జునుడికి శివుడు కనపడడు. శివుడు అర్జునుడి వెనుకనుంచి అడవి పంది మీదకి బాణం ప్రయోగించాడు. అది అడవిపంది పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. ఇది శివుడి బాణం. ఆ బాణం తగిలిన వెంటనే అడవిపంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. బాణం ఎక్కుపెట్టి అడవిపందిని గురిచూసి కొట్టాడు అర్జునుడు. అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠ భాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. ఉత్తరక్షణం నేలమీద పడిపోయి చచ్చిపోయింది. శివుడి ప్రమథగణములు వెనుక కిరాతులుగా వచ్చారు. శివుడు వారిలో ఒకడిని పిలిచి తన బాణమును తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి కలహామును పెంచుకునే ప్రయత్నంగా అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన మహానుభావుడు. గొప్ప కిరాతవీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త. అన్నాడు. అపుడు అర్జునుడు నేనూ బాణం వేశాను. నా బాణానికే ఈ పంది చచ్చిపోయింది. ముందు నేనే ఎక్కుపెట్టాను అన్నాడు. ఇద్దరి మధ్యా వాదం పెరిగింది. అపుడు అర్జునుడు మీ నాయకుడు అంత గొప్ప మొనగాడయితే నాతో యుద్ధమునకు రమ్మనమని చెప్పు అన్నాడు. ఆ మాటకోసమే పరమశివుడు ఎదురుచూస్తున్నాడు.
వెంటనే శివుడు కొండమీద నుండి గభాలున దూకాడు. తన శరీరమునకు పులితోలును అడ్డంగా కట్టేసుకున్నాడు. తన కొప్పును బాగా ముడివేశాను. దానినిండా నెమలి ఈకలు పెట్టుకున్నాడు. ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. కిరాతుడి రూపంలో ఉన్న శివుడు ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి ఏరా కుర్రా, ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ బాణములను వెయ్యి చూద్దాం. ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు.
వెంటనే అర్జునుడు ముందుగా గాండీవం టంకారం చేశారు. శివుడు నవ్వి ఒక హుంకారం చేశాడు. ఆ హుంకారమునాకు అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. ఆ కిరాతుడు మామూలు వాడు కాదనుకుని అర్జునుడు తన గాండీవంలో బాణములు పెట్టి శివుని మీద ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా కోపం నటించి తన చేతిలోని ఒక ధనుస్సు ద్వారా అర్జునుని మీదకు బాణములు వేస్తున్నాడు. అర్జునుడికి మహా కోపం వచ్చేసింది. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని కొట్టేస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరమును ఎవ్వరూ తాకరో, ఎవరి శరీరం తెల్లని పేరుకున్న నెయ్యిలా ఉంటుందో, ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరమును ఇపుడు అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో కౌగలించుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకూ ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికి ఉన్న విభూతి అంతా ఈయనకు అంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి. కాబట్టి మల్లయుద్ధం పేరుతొ పరమేశ్వరుడు అర్జునుడి అవయవములన్నిటిని కౌగలించేసుకున్నాడు. తరువాత బాగా తిప్పి అర్జునుని శరీరమును త్రోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగిలేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ‘ఆహా, ఏమి మొనగాడివిరా నీవు, ఎంత పౌరుషంరా నీకు అని అనుకుని యుద్దమును చాలించాలనుకున్నాడు. అపుడు మహానుభావుడు చంద్రవంకతో, పట్టుపుట్టంతో, వామార్థ భాగమునందు పార్వతీ దేవితో అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.మళ్ళీ కొడదామని అర్జునుడు గాండీవమును ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్థనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు కనపడ్డారు. గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదముల మీద పడిపోయాడు. శంకరా, ఇంత కృపా నామీద! నాచేతి దెబ్బలు తిన్నావా! నాతో మల్లయుద్ధం చేశావా తండ్రీ అని శంకరుని పలువిధముల స్తోత్రం చేసి ఆయన పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు అర్జునుని చూసి అర్జునా నన్ను కొట్టానని ఎందుకు బాధ పడతావు? అలా అనుకోవద్దు. నీవు నాకు చేసినా పూజగా దానిని నేను స్వీకరించాను. నీకేమి కావాలో అడుగు ఇచ్చేస్గ్తాను అన్నాడు. అపుడు అర్జునుడు శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ఈశ్వరా, నీవు కంటి ఎదుట కనపడుతున్నావు. పరాత్పరుడవు. జగద్భర్తవు. అటువంటి తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణములు వేశాను. నేను కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రీ! నీ కారుణ్యంతో నాగుండె నిండిపోయింది. అని పరమేశ్వరుని పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్రంలో పాండవులు గెలిచి తీరుతారు. విజయీభవ! దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయం ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, వినినా చదువుకుని బయలుదేరినా శివదండకమును చదువుకుని బయలుదేరినా వినినా ఈ ఆఖ్యానమును చదివి నమస్కరించినా అటువంటి వారికి జటిలమయిన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక! నీకు ఏ విజయం కలుగుతుందో వినిన వారికి, చదివిన వారికి కూడా అటువంటి విజయము కలుగుగాక! అని ఆశీర్వచనం చేసి ఆర్జునుడిని పంపించాడు.

No comments: