Monday, December 9, 2013

రాగి పాత్రలో నైవేద్యం మహిమ



















రాగి పాత్రలో నైవేద్యం విశిష్టిత 

సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము.
ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. 
ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. 
పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . 
అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. 
గుడాకేశుడు విష్ణువు భక్తుడు. 
నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. 
ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. 
ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . 
అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. 
అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, 
కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. 
అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. 
విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. 
గుడాకేశుడు సంతోషించాడు. 
విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. 
వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, 
మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. 
తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. 
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. 
వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. 
ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. 
గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. 
ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. 
ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. 
అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. 
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, 
ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. 
అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. 
సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. 
పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! 
కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి
ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి
వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...
మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే..ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు..లోకాస్సమస్తాస్సుఖినో భవంతు!

No comments: