Thursday, December 3, 2015

శివపురాణము--22


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన 
శివపురాణము--22
రుద్రాక్ష ధారణ – మారేడు దళము 
భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు. 
మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. అందుకే రుద్రాక్ష మాలలో పగదమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష. 
రుద్రాక్ష వేసుకోవడం అంటే ‘నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే ‘యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు. 
ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము.
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః!
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!!
లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉన్నది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే 
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడ్ ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు మూడు కింద తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెకాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీసూక్తంలో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ (అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది. 
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. 
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. 
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

No comments: