Thursday, December 24, 2015

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం



1::ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం  

2::భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్  

3::భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ 

4::కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్
జయశ్రీ సమేతం భజే రామదూతమ్ 

5::చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం
భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ 

6::రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే   

7::ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్  

8::మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం
మహారోగపీడాం మహతీవ్రపీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ  

9::సుధాసింధు ముల్లంఖ్యనాధో ప్రదీప్త
స్సుధా చౌషధీస్తా ప్రగుప్తప్రభావా
క్షణద్రోణశైలస్య సారేణసేతుం
వినా భూస్వ్యయం కస్సమర్థః కపీంద్రాః  

10::నిరాతంక మావిశ్యలంకాం విశంకో
భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం
విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్  

11::రమానాధరామా క్షమానాధరామా
మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం
విపాత్యప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా  

12::జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢా గాఢప్రతాపే
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురుశ్రీ హనూమాన్ ప్రభోమే దయాళో  

13::మహాయోగినోం బ్రహ్మరుద్రాదయోవా
నజానంతి తత్త్వం నిజం రాఘవస్య
కధం జ్ఞాయతే నీద్పషేనిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే |13|
 14::నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం  

15::నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం  

16::హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః
పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో
సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః  
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]

Saturday, December 19, 2015

శివపురాణము--38


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పూర్వకాలంలో భ్రుగువు అనే మహర్షి ఉండేవారు. ఆయన భార్యపేరు ఊర్జస్వతి. భ్రుగువుకి భార్గవుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. ఊర్జస్వతి ప్రియవ్రతుని కుమార్తె. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడి సోదరుడు. ఉత్తానపాదుడి పేరు వినేసరికి మీరు ధ్రువుడు జ్ఞాపకమునకు రావాలి. భార్గవునకు నలుగురు కుమారులు కలిగారు. వాళ్ళపేర్లు – చండుడు, అమర్కుడు, త్వాష్ట్రుడు, ధరాత్రుడు. చండుడు అమర్కుడు వీరిద్దరూ రాక్షసులకు గురువులు. ప్రహ్లాదునికి పాఠములు నేర్పిన గురువులు వీరే. భార్గవుడికి శుక్రుడనే పేరు ఉంది. భార్గవుడికి ఒక కోరిక పుట్టింది. సృష్టి క్రమంలో బ్రహ్మగారు ఒక జీవికి ఇన్ని సంవత్సరములు అని నిర్దేశిస్తాడు. ఆ తరువాత జీవి చనిపోవాలి. ఇపుడు భార్గవుడు బ్రహ్మగారు వ్రాసిన రాతను తిరగరాయాలనుకుంటున్నాడు. అందుకుగాను మృతసంజీవని అంటే చచ్చిపోయిన శరీరమును ఏశరీరంతో అయితే చచ్చిపోయాడో ఆ శరీరంతో మళ్ళీ పుట్టించాలి అని అనుకున్నాడు. ఈ కోరిక తీరడానికి కాశీ పట్టణంలో తపస్సు చేస్తే తొందరగా పరబ్రహ్మ తృప్తి చెందుతాడు. కాబట్టి తాను అక్కడికి వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకొని తపస్సు ప్రారంభించాడు. కాశీలో ఒక శివలింగమును ప్రతిష్ఠచేశాడు. దానికి ప్రతిరోజూ వెయ్యిమార్లు అభిషేకం చేసేవాడు. అందులో ఆయన తప్పకుండా మూడింటిని వాడేవాడు. మొదటిది పంచామృతములు, రెండవది శుద్ధజలము, మూడవది గంధోదకమును వాడాడు. అభిషేకానంతరం పరమశివుడికి అర్చన చేయాలి. ఇలా అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు. అవి సంపంగి, ఉమ్మెత్త, గన్నేరు, తామర, కొండగోగు, జాజి , కడిమి, పొగడ, కలువ, మల్లె, కమలములు, సొరపున్నపువ్వులు. వీటితో పాటు దర్భాగ్రములు మామిడి చిగుళ్ళు దుర్వాంకురములు కూడా అభిషేకంలో వాడతారు. 
భార్గవుడి పూజకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు మృతసంజీవని విద్యను ఉపదేశించాడు. ఒకసారి పరమేశ్వరుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా వెనకనుంచి పార్వతీదేవి వచ్చి పరిహాసమునకు పరమశివుని నేత్రములు మూసింది. అపుడు పరమశివుద్ ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదము తెచ్చిందో చేతులు తీసి చూడు అన్నారు. సమస్త బ్రహ్మాండములు చీకటి అయిపోయాయి. ఈ స్థితిలో అమ్మవారు చేతులు తీయగానే మరల ప్రకాశించాయి. ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపమును పొంది శివ చేష్టితంగా అంధకారమునందు కళ్ళు లేకుండా నల్లపిల్లవాడు ఒకడు పుట్టి ఏడుపు మొదలుపెట్టాడు. అంధకారం నుండి పుట్టిన వాడు కాబట్టి వాడికి అన్ధకుడు అని పేరు వచ్చింది. వాడు పర్వత సదృశుడై పెరిగిపోయి తనని సమీపించిన వారిని నోట్లో పడేసుకుంటున్నాడు. వీడెవడు? అని అమ్మవారు భర్తను అడిగింది. పరమశివుడు నువ్వు నా కళ్ళు మూయడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకూ నాకూ కొడుకే అన్నాడు. ఇప్పుడు వాడిని చంపివేయడానికి వీలులేదు. వాడిని కాపాడాలి అని వాడిని పిలిచి అరణ్యములకు పంపించివేశారు. 
హిరణ్యాక్షుడికి కొడుకులు కలగడం లేదని శంకరుని గూర్చి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై నీకు సరిపోయే నాకుమారుడొకడు పుట్టి పెరుగుతున్నాడు. నీవు వాడిని సొంత కొడుకుగా భావించవచ్చు తీసుకు వెళ్లి పెంచుకో అని అంధకుడిని ఇచ్చారు. వాడు అంధకాసురుడయ్యాడు. కొంతకాలం గడిచిన పిదప ఆదివరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు. అంధకాసురుడికి కళ్ళు లేవు. కాబట్టి వాడికి రాజ్యం ఇవ్వడం కుదరక పోవడంతో అంధకుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి కావాలి? అని అడిగారు. అప్పుడు వాడు రెండు వరములు కోరాడు. – నాకు కళ్ళను ఇవ్వవలసినది, నాకున్న బలంతో కంటితో చూస్తూ నేను లోకములనన్నిటిని గలవాలి. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు అన్నాడు. అపుడు బ్రహ్మగారు చూపును ఇస్తున్నాను. కానీ రెండవది నా పరిధిలో లేదు ఇంకొకమాట చెప్పు అన్నారు. అపుడు వాడు ఉత్తమజాతి, మధ్యమజాటి, కనిష్ఠజాతి స్త్రీలయందు ఉండే లక్షణములు అన్నీ ఏ తల్లినుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు భవిష్యత్కాలమునందు వర్తమాన కాలమునందు ఈ కాలములకు ముందు వెనుక కూడా ఉంటుందో ఏ తల్లి మహా సౌందర్యరాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలి’ అన్నాడు. అసలు అటువంటి కోరికే కోరకూడదు. బ్రహ్మగారు తథాస్తు అన్నారు.
ఒకనాడు వీడి భటులు కైలాస ప్రాంతమునకు వెళ్ళారు. మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారములు చేస్తోంది. ఈ భటులు వారిరువురినీ చూశారు. ఈ తపస్సు చేసుకునే వాడికి ఇంత అందమయిన భార్య ఎందుకు. అంధకాసురుడికయితే బాగుంటుంది అనుకుని వెళ్ళి అంధకాసురునికి చెప్పారు. వాడు నీ భార్యను నాకిచ్చెయ్యి. లేకపోతే చంపేస్తాను అని శివుడికి కబురు పెట్టాడు. అపుడు శివుడు నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతులలో నేను చచ్చిపోలేను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడరాదు అన్నాడు. వాడికి అర్థం కాలేదు. శంకరుడు మరోచోటికి వెళ్లి వేయి సంవత్సరములు తపస్సు చేసుకుంటాను అని పార్వతికి చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆయన భార్యను వదిలివేయలేదు. వాడి పాపం పండడానికి తాను మధ్యలో ఉండకూడదని అలా మాట్లాడాడు. వాడు అమ్మవారిని మోహంతో కూడిన చూపు చూడాలి. అటువంటి చూపు చూసి వాడు చచ్చిపోవాలి. ఇదీ శంకరుని ఉద్దేశం. ఇపుడు అంధకాసురుడు అమ్మవారి కోసమని యుద్ధం మొదలుపెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం. రాక్షసులందరూ అంధకాసురూడి పక్షం. యుద్ధం జరిగింది. ఆయుద్ధం వేయి సంవత్సరములు జరిగింది. శంకరుడు తపస్సు ముగించుకుని తిరిగి వచ్చాడు. 
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. విఘసుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గరనుంచి బ్రహ్మగారి వరకు దేవతలనందరినీ నోట్లో పడేసుకుని మింగేశాడు. శంకరుడు త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే మరల దేవతలందరూ వాడినోట్లోంచి బయటపడ్డారు. శంకరుడు రాక్షస సైన్యమును పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం శుక్రాచార్యుల వారు మృత సంజీవనీ విద్యతో వాళ్ళని బ్రతికించడం జరుగుతోంది. ఎంతమంది రాక్షసులను చంపినా వారు తిరిగి బ్రతికి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు శివుడు శుక్రుని బంధించి ఇక్కడకు తీసుకురండి అన్నాడు. దేవతలు వెళ్ళి శుక్రుడిని పట్టి శివుని దగ్గరకు తీసుకువచ్చారు. శివుడు ఆయనను నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్లి గర్భవాసం చేస్తున్నాడు. ఆయనకి బయట ఏం జరుగుతోందో కనపడుతోంది కానీ తానూ పునర్జీవితులని చేయడం కుదరదు. అన్నీ శివుడిలో ఉన్నాయని నేను ఏ స్తోత్రం చేశానో ఇప్పుడు వాటిని నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు. ఆఖరుకి అందరూ చచ్చిపోయారు. అంధకాసురుడు మిగిలిపోయాడు. శంకరుడు త్రిశూలంతో గ్రుచ్చాడు. చంపలేదు. వాడు త్రిశూలంమీద పడుకుని ఆయన జటాజూతమును పీకుతున్నాడు. శంకరుడు దానికి ప్రతీకారం చేయలేదు. వాడి దృష్టి కోణంలో మార్పు వచ్చింది. ఈ కంటితో ఇన్నాళ్ళనుంచి దేనిని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములని అనుకుంటున్నానో అవి యథార్థములు కావనే జ్ఞానం కలిగింది. అప్పుడు వాడు శంకరుని నూట ఎనిమిది నామములు చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుల పాదముల మీద పడి నా తప్పు మన్నించి నన్ను కరుణించండి అని ప్రార్థించాడు. అపుడు శంకరుడు నిన్ను ప్రమథగణములలో తీసుకుంటున్నాను అని చెప్పి వానిని తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడై భక్తితో బ్రతికేశాడు. 
శుక్రాచార్యుడు ఇంకా శివుని గర్భంలోనే ఉన్నారు. అక్కడే ఉంది శివుడిని గొప్ప స్తోత్రం చేశారు. భార్గవుడు చేసిన స్తోత్రమునకు శంకరుడు మిక్కిలి ప్రీతి చెందాడు. భార్గవునితో ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నీవు నా కుమారుడివి. హద్దు లేకుండా వరమును ఉపయోగించడం ఎంత ప్రమాదమునకు వెడుతుందో తెలుసుకున్నావు కదా! అని భార్గవుడిని విసర్జించాడు. ఈశ్వర శుక్రనాళంలోంచి బయటకు వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంక లేడు కనుక భార్గవుడు అనే పేరు ప్రక్కకిపోయి శుక్రాచార్యుడు అన్నపేరు ప్రకాశించింది. అంత గొప్ప స్థితిని శుక్రాచార్యుల వారు పొంది లోకమునంతటిని ప్రకాశింపజేశారు. అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టి కోణం నందు ఇటువంటి మార్పు రావాలి. మనం కోరరాని కోర్కెలు కోరినా ఈశ్వరుడు భక్తికి లోన్గుతాడు. కానీ అవి కొన్ని సార్లు ఇబ్బందుల వైపుకి తీసుకువెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోర్కె ఒక్కటే. మనం భగవంతుడిని అడగవలసింది ఒక్కటే. ఈశ్వరా, నీ పాదములయందు నిశ్చలమయిన భక్తిని నాకు కృపచెయ్యి అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మనలను కాపాడవలసిన బాధ్యత భగవంతుని మీద పడుతుంది. మీ మనస్సు కదిలిపోకుండా ఆయన తన పాదములను అందించాలి. కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు. ఇది మనం గ్రహించవలసిన నీతి. ఆ నీతిని గ్రహించి దానిని ఆచరణాత్మకం చేసుకున్న నాడు మనం ధన్యులం అవుతాం. మనకు అటువంటి శక్తిని ఈశ్వరుడు తననిర్హేతుకకృపాకటాక్షవీక్షణముల చేత మనకు యిచ్చి రక్షించుగాక! అని ప్రార్థన చేద్దాం.

Friday, December 18, 2015

సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం:


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం

శంకరాచార్య కృత సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం: 

1::సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ..మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా  
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే..విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః  

2::న జానామి శబ్దం న జానామి చార్థం..న జానామి పద్యం న జానామి గద్యమ్  
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే..ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్  

3::మయూరాధిరూఢం మహావాక్యగూఢం..మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్  
మహీదేవదేవం మహావేదభావం..మహాదేవబాలం భజే లోకపాలమ్  

4::యదా సంనిధానం గతా మానవా మే..భవాంభోధిపారం గతాస్తే తదైవ  
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే..తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్  

5::యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే 
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం..సదా భావయే హృత్సరోజే గుహం తమ్  

6::గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢాస్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః  
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః..స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు  

7::మహాంభోధితీరే మహాపాపచోరే..మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే  
గుహాయాం వసంతం స్వభాసా లసంతం..జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్  

8::లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే..సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే  
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం..సదా భావయే కార్తికేయం సురేశమ్  

9::రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే..మనోహారిలావణ్యపీయూషపూర్ణే  
మనఃషట్పదో మే భవక్లేశతప్తః..సదా మోదతాం స్కంద తే పాదపద్మే  

10::సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం..క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్  
లసద్ధేమపట్టేన విద్యోతమానాం..కటిం భావయే స్కంద తే దీప్యమానామ్  

11::పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్  
నమస్యామ్యహం తారకారే తవోరః..స్వభక్తావనే సర్వదా సానురాగమ్  

12::విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్  
హతేంద్రారిషండాన్జగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్  

13::సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః..సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్  
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ 

14::స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని  
సుధాస్యందిబింబాధరాణీశసూనో..తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి  

15::విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం..దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు  
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః  

16::సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా..జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ 
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః..కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః  

17::స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః  
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః..పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః 

18::ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్  
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం..హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్  

19::కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ  
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్..ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్  

20::ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే..కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే  
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం..ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్  

21::కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింద్ధి భింద్ధీతి మాం తర్జయత్సు 
మయూరం సమారుహ్య మా భైరితి త్వం..పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్  

22::ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా..ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారమ్  
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే..న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా  

23::సహస్రాండభోక్తా త్వయా శూరనామా..హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః  
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం..న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి  

24::అహం సర్వదా దుఃఖభారావసన్నో..భవాందీనబంధుస్త్వదన్యం న యాచే  
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం..మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ 

25::అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః  
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం..విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే 

26::దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్  
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం..గుహే సంతు లీనా మమాశేషభావాః  

27::మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః  
నృణామంత్యజానామపి స్వార్థదానే..గుహాద్దేవమన్యం న జానే న జానే  

28::కలత్రం సుతా బంధువర్గః పశుర్వా..నరో వాథ నారీ గృహే యే మదీయాః  
యజంతో నమంతః స్తువంతో భవంతం..స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార  

29::మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే  
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే..వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల  

30::జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం..సహేతే న కిం దేవసేనాధినాథ  
అహం చాతిబాలో భవాన్ లోకతాతః..క్షమస్వాపరాధం సమస్తం మహేశ  

31::నమః కేకినే శక్తయే చాపి తుభ్యం..నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ  
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం..పునః స్కందమూర్తే నమస్తే నమోఽస్తు  

32::జయానందభూమం జయాపారధామం..జయామోఘకీర్తే జయానందమూర్తే 
జయానందసింధో జయాశేషబంధో..జయ త్వం సదా ముక్తిదానేశసూనో  

33::భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః..పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య  
స పుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః  

శివపురాణము--37


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

సాక్షాత్తు పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకమాట అన్నాడు. ‘పార్వతీ నన్ను ఎందఱో స్తోత్రం చేశారు. నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా! అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమయిన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడిన స్తుతిలో ఒక్క శ్లోకం గాని, అర్థ శ్లోకం గాని ఒక పాదం కాని, అవేమీ రాకపోతే ఒక మాట కానీ అదీ రాకపోతే అది వినడం కానీ చేసిన వారికి నేను నా అనుగ్రహమును వర్షిస్తాను’ అని చెప్పాడు. ఈవిషయం మహానుభావుడు పోతనగారు వీరభద్ర విజయంలో చెప్పారు.
ఒకానొకప్పుడు దేవతలు దానవులు అమృతోత్పాదనం చేయాలనీ క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతమును తీసుకు వెళ్ళి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడే పామును చుట్టారు. దానిని దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకుని తిప్పుతున్నారు. యథార్థమునకు ఇదంతా ధ్యాన సంబంధమయిన విషయం. లోపల మనస్సును తిప్పినప్పుడు వచ్చే స్థితియందు ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి అన్నది దీనిద్వారా తెలియజేయబడుతుంది. ఆ మందర పర్వతం క్రిందికి దిగిపోకుండా ఉండడం కోసం ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీమహా విష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఈ మందర పర్వతమును ఆయన వీపు మీద పెట్టారు. దానిని ఎంత తిప్పినా ఆయన వీపు దురద తీరలేదు. అలా తిప్పుతుంటే పాలసముద్రంలో ఉన్న పాములు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో కలిసి పైకిలేచి ఒడ్డున పడ్డాయి. తాబేలుతో గొడవ ఉండదు. అది భూమిమీదపడినా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. కానీ చేప ఒకసారి ఒడ్డునపడితే ఇక దానిజీవితం అయిపోయినట్లే. ఆ పర్వతం తిరుగుతుంటే వచ్చిన చప్పుడుకి బ్రహ్మలోకంలో తపోనిష్ఠలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. వాళ్ళు కోరుకున్నది అమృతం. మొట్టమొదట పుట్టింది హాలాహలం. ఆ పుట్టిన హాలాహలం పెద్దపెద్ద గంతులు వేసుకుంటూ భూమిమీదకి వచ్చింది. అది వెళుతుంటే నదులు ఇంకిపోయాయి. అరణ్యములు కాలిపోయాయి. అలా అన్నింటినీ బూది చేస్తూ హాలాహలం వెళ్ళిపోతోంది. అందరూ పరమశివుడి దగ్గరకు పరుగెత్తారు.
పరమశివుడు ‘మీకు ఏమి కష్టము వచ్చింది’ అని అడిగారు. ఈశ్వరా నీవు అంతటా నిండిపోయిన వాడవు. నీకు తెలియనిది ఏమీ ఉండదు. నీవు మమ్మల్ని రక్షించాలి. అని స్తోత్రం మొదలుపెట్టారు. చంద్రరేఖ ధరించిన ఓ ఈశ్వరా, మమ్మల్ని చంపడానికి అవతలివైపు నుంచి హాలాహలం వచ్చేస్తోంది. దానిని పుచ్చుకోగల సమర్థుడఉ నీవే. తండ్రీ మమ్మల్ని రక్షించవా’ అని అడిగారు. అపుడు శంకరుడు పార్వతీదేవి వంక చూశాడు.
కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము దాన గీర్తి మృగాక్షీ!!
ఈశ్వరీ జగత్తు అంతా ఎంత దుఃఖపడిందో చూశావా! మనం లోకములకంతటికీ ప్రభువులం. మన పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగింపజేయాలి. వాళ్ళ కష్టమును మనం గట్టెక్కించాలి. కాబట్టి హాలాహలమును నేను పుచ్చేసుకుంటాను. అలా నేను పుచ్చుకుంటానని బెంగ పెట్టుకుంటున్నావా? హాలాహలం పుచ్చుకుంటే నేనేమయినా అయిపోతానని అనుకుంటున్నావా?
శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!
బాగా విచ్చుకున్న పద్మము వంటి ముఖమున్న పార్వతీ, నాకు ఏమీ అవదు. నేను ఆ హాలాహలమును శిక్షిస్తాను. దానిని ఒక మధుర ఫలముగా నోట్లో వేసేసుకుంటాను. ప్రాణికోట్లను రక్షణ చేస్తాను. ఎలా స్వీకరిస్తానో చూడు అన్నాడు. ఆవిడ మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పింది. తన మేడలో మంగళ సూత్రం ఉండగా ఆయన హాలాహలం పుచ్చుకున్నా ఆయనకు ఇబ్బంది రాదు అనే ప్రగాఢ నమ్మకం ఆమెకు ఉన్నది. అందుకని అడ్డు చెప్పలేదు. పరమశివుడు హాలాహలమునకు ఎదురు వెళ్ళాడు. దేవతా గానములన్నీ ఆయనకు జయజయ ద్వానములు చేస్తున్నాయి. శివుడు హాలాహలమును చేతితో పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండంత చేసుకుని దానిని పుచ్చేసుకుని మ్రింగి వేయడానికి సిద్ధపడిపోయారు. కంఠం దగ్గరికి వెళ్ళింది. అపుడు శివుడు అయ్యయ్యో ఇపుడు నేను కడుపులోకి ఈ విషాన్ని వదిలేస్తే కడుపులో ఉన్న లోకములు కాలిపోతాయి. పైకి వదిలి వేస్తె ఈ లోకములు కాలిపోతాయి. కాబట్టి దీనిని వదలకుండా ఉంచుతానని దానిని తన కంఠంలో పెట్టేసుకున్నాడు. కంఠం నీలంగా మచ్చ పడినట్లుగా కనపడుతోంది. అప్పటివరకు ఆయనకు మచ్చ లేదు. తెల్లటి శంకరుడు. కంఠంమీద కొంచెం నల్లగా మచ్చ కనపడుతోంది. లోకములను రక్షించదానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకు ఆభరణమై కూర్చుంది.
ఈ హాలాహాల భక్షణం గురించి ఒక సందర్భంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పవలసి వచ్చింది. పార్వతీ ఈవేళ ఈ హాలాహాల భక్షణ కథ నీకు ఎందుకు చెప్పానో తెలుసా?
హాలాహాల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్
వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై!!
ఇప్పటివరకూ ప్రపంచంలో హాలాహల భక్షణ కథ వినినా చదివినా అటువంటి వాళ్ళను తేళ్ళు జెర్రులు పాములు కరవవు అని లోకంలో ఫలశ్రుతి ఉంది. కాబట్టి ఈ కథను అందుకోసం వింటూంటారు. కానీ పార్వతీ ఇవాళ నేను నీకొక రహస్యం చెప్తున్నాను. ఆ సమయంలో దేవతలు వచ్చి నన్ను చేసిన స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కానీ, ఒక పద్యం కాని, నోటికి వచ్చినా కనీసంలో కనీసం దేవతలు చేసిన స్తోత్రంలో కనీసం రెండు పాదములు నేర్చుకున్నా కనీసం ఒక పాదం నోటికి వచ్చినా కనీసం నీలకంఠ అన్నమాట వస్తే చాలు. చాలా భక్తితో చెప్పబడిన ఈ వృత్తాంతం పరమసత్యం అని మనస్సునందు విశ్వసించి నా కంఠమును ఒక్కసారి ధ్యానం చేసి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, ఈ వృత్తాంతమును చదివిన వారికి విన్నవారికి ఇహమునందు సకల సంపత్తులు కలుగుతాయి. వారికి ఏ బాధా ఉండదు. అటువంటి వాడు తేలికగా అంత్యమునందు శరీరము నుండి విడివడి నన్నుచేరి కైలాసమునందు వసించి సర్వకాలముల య్నాడు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠస్తవము, హాలాహాల భక్షణము అనే ఆఖ్యానం చాలా ఉత్కృష్టమయినది.

Thursday, December 17, 2015

శివపురాణము--36


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

లింగావిర్భావం 
ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.
అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. 
శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి. 
లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట. 
శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే. 
అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి. 
శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి. 
శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది. ఫేంటు ధరించికాని, తోలు బెల్టు పెట్టుకుని గానీ గర్భాలయం లోపలి వెళ్ళకూడదు.

Wednesday, December 16, 2015

శివపురాణము--35


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

నందీశ్వరుడు

మనం శివాలయమునకు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనం ఇచ్చే భగవన్మూర్తి నందికేశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి. విష్ణ్వాలయం ద్వారపాలకులు జయవిజయులు. విష్ణ్వాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై ఒక పశువు శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? దీనిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం శివాలయపు మెట్లు దాటి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ధ్వజ స్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ నందీశ్వరుడు అసలు అలా ఎందుకు ఉంటాడు అనే విషయం మీకు అర్థం అయితే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్లు. 
పూర్వం శిలాదుడు అనే మహర్షికి చిత్రమయిన కోరిక కలిగింది. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి నీకు ఏమి కావాలి? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమ భక్తుడయిన కుమారుడు కావాలి’ అన్నాడు. అపుడు దేవేంద్రుడు ‘నాకే శాశ్వతత్వము లేదు. నాకే చిరంజీవిత్వం లేదు. అటువంటప్పుడు ఎదుటివాళ్ళకు నేను ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తపించు’ అన్నాడు. అపుడు శిలాదుడు శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొద్దికాలం గడిచేసరికి శిలాదుని రూపం అక్కడలేదు. ఆస్థిపంజరం ఒక్కటే ఉంది. శంకరుడు ప్రమథగణములతో, పార్వతీ సహితుడై, సుబ్రహ్మణ్య, గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అపుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవ్రేలితో ఆయన మూడవకన్ను అనగా జ్ఞాన నేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరపెట్టి ఆపాడు. అప్పుడు శిలాడుడు బహిర్ముఖుడు అయ్యాడు. శంకరుడు ‘శిలాదా, నీవు దేనిని గురించి తపస్సు చేశావు? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈమాట అనేసరికి శంకరుడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేదు. నీ భక్తికి లొంగిపోయాను. కనుక నేనే నీకొడుకుగా వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు. 
కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమయిన ఒక యజ్ఞకార్యమును నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాలా నిర్మాణం చేసి అగ్నిహోత్రములను వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు చంద్రరేఖవంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినము లేకుండా ప్రకాశించి పోతున్న తెల్లని శరీరం మీద అలదిన భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. నాలుగు భుజములు కలిగి ఉన్నాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్లుగా ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి నందీ అని పిలిచాడు. ప్రజలందరూ చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానం అవుతున్నాడు. 
శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ‘ఆదివృషభము’ను పిలిచాడు. దానికి ధర్మము అని పేరు. నీవు ధర్మ స్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడుగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనం ఇచ్చాడు. శివునికి తనకి అభేదం చెప్పడానికి అలా దర్శనం ఇచ్చాడు. బాలశివుడయి ఉన్నాడు. కొంతకాలం అయిన పిమ్మట ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి శిలాడుడితో అన్నారు ‘అయ్యో శిలాదుడా నువ్వు ఎటువంటి స్వరూపమును కోరావో అటువంటి స్వరూపమును నీ పిల్లవానికి ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపొయింది’ అని చెప్పారు. ఈ మాటలకు శిలాదుడు బాధపడి శోకిస్తున్నాడు. అపుడు పిల్లవాడయిన నందీశ్వరుడు ‘నాన్నగారూ, ఎందుకంత బాధపడతారు? నేను శంకరుని గూర్చి తపస్సు చేస్తాను’ అని చెప్పి మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసిన తపస్సు చేత ప్రీతిచెందిన శంకరుడు ప్రత్యక్షమయి నీవు ఎప్పటికీ చిరంజీవివే. నామీద నీకు ఎంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకు నీ తపస్సుకు నేను పరవశించాను అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మములతో కూడిన హారమునొకదానిని ఎదురుగుండా వున్నా పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి కూడా మూడవకన్ను వచ్చింది. శివునికి అయిదు ముఖములు ఎలా ఉంటాయో అలా అయిదు ముఖములు వచ్చాయి. పది భుజములు వచ్చాయి. ఈవిధంగా వచ్చి పిల్లవాడు శివునితో సమానంగా అలరారుతూ శివుని ఎదుట నిలబడ్డాడు. అపుడు అమ్మవారి పుత్రప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుడిని కొడుకుగా అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో వున్నా నీళ్ళు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు. అవి నందీశ్వరుడినుండి జాలువారి ‘త్రిశ్రోట, జటోదక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని’ అను పేర్లు గల అయిదు నదులుగా ప్రవహించాయి. ఈ అయిదు నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠచేసిన శివలింగం ఒకటి ఉంది. ఆ అయిదు నదులలో స్నానం చేసి అక్కడి శివలింగమును ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెప్పింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమథగణములకు నాయకునిగా చేయవలసినదని శివుని అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవానిని కూర్చోబెట్టి ప్రమథగణములన్నింటికి నాయకునిగా అభిషిక్తం చేశారు. 
ఈవిధంగా అభిషిక్తం చేయబడిన వానికి తగిన కాంతను చూసి వివాహం చేద్దామని పార్వతి శివునకు చెప్పింది. ఆయనకు తగిన భార్యగా మరుత్తుల కుమార్తె ‘సుయశ’ను నిర్ణయించి వివాహం చేశారు. పిమ్మట శివుడు నందీశ్వరునితో ‘నీవల్ల నీతండ్రి తరించాలి కదా. నీ తండ్రిని, తాతని కూడా సమున్నతమయిన అధికారం కలిగినటువంటి ప్రమథగణముల స్థితిలోకి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు’ అన్నాడు. ఇప్పుడు శిలాదుడు ప్రమథగణములలో ఒకడిగా చేరిపోయాడు. ప్రమథగణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు. ఇదీ వాళ్ళ గొప్పతనం. ఇది నందికేశ్వరుడి చరిత్ర. శివుడు నందీశ్వరునికి మరొక వరం ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేను ఎక్కడయినా ఉంటే నీవు కూడా అక్కడ ఉంటావు. శివాలయములలో నా ఎదురుగుండా నీవు ఉండాలి’ అని చెప్పాడు. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఎవరయినా నందికేశ్వర చరిత్రను చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ వినినా నందికేశ్వరుని వైభవమును మనసులో తలంచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములను యిచ్చి అంతమునందు ఇదివిని పరవశించి పోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటాడు అని అభయం ఇవ్వబడింది. 
నందీశ్వరుడు ఆదివృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి ప్రక్కనుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో వెళ్ళడం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషణములు కనపడేటట్లుగా నందీశ్వరుని మూర్తి పడుకుని ఉంటుంది. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద వేసి కుడిచేతితో ఆయన వృషణములను పట్టుకుని రెండు వేళ్ళ మధ్యలోంచి శివలింగమును చూస్తూ ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని అనాలి. ఇలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునందు శంకరుడిని దర్శనము చేసిన పుణ్యమును వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చేయరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతం. శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చేయకూడదు. దానికి ఒకే ఒక్క మినహాయింపు వున్నది. శివలింగమునకు సాయంకాలం కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగమును శృంగములలోంచి చూడనక్కరలేదు. మీరు తిన్నగా శివ దర్శనం చేయవచ్చు. 
అరటిపండు ముక్కలు పట్టుకు వెళ్ళి నందీశ్వరుడి మూతికి రాయడం, కార్తిక దీపముల పేరు చెప్పి నందీశ్వరుడి తోకకింద పెట్టేయడం వంటి పనులు మిక్కిలి పాపభూయిష్టములు. మనం పుణ్యం పేరుతో హద్దులేని పాపములు చేస్తుంటాము. అలా చెయ్యకూడదు. నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరునికి నమస్కరించి 
“నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక!
మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి!!
అని అడగాలి. నందీశ్వరుడు నాలుగు పాదములతో చక్కగా పడుకుని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మము మీదనే శివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు మీకొక పాఠమును నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మీకు లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుడినే చూడడం అలవాటు కావాలి. 
ఆంద్రదేశంలో నందిమండలం’ అనే ప్రాంతంలో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణ(విష్ణు)నంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనునవి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి ‘నందివిద్య’ అని పేరు. అయ్యగారి అనుగ్రహమును ఎంత పొందాడో అమ్మవారి అనుగ్రహమును కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యమునంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో ‘నందివిద్యానటేశ్వరీ’ అని ఒకమాట ఉంది.
నందీశ్వరుని ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి ‘చరనంది’ అని ఒకటి ఉంటుంది. ‘స్థిరనంది’ అంటే కదలని నంది. చరనంది కదులుతుంది. పూర్వం శివాలయములలో రెండు నందులు పెట్టేవారు. ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కారు. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికయినా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే తల్లీ బిడ్డా బతకాలంటే వైద్యుడి దృష్టిపడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనందికి శివుడికి అభేదం కనుక గబగబా ఆవిడను ముఖమండపం వద్దకు తీసుకువచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్నవైపుకి చరనందిని తిప్పేవారు. చరనందిని ప్రసవమునకు బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడ చాలా సులువుగా ప్రసవం అయ్యేది. అందుకే పూర్వం శివాలయములలో చరనంది ఉండేది. నందీశ్వరుడు అంతటి మహానుభావుడై ఈ లోకమును రక్షించాడు.

Tuesday, December 15, 2015

శివపురాణము--34


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. 
ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చందీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు. 
ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చందీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. 
ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం.

Monday, December 14, 2015

శివపురాణము--33


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కృష్ణ భగవానుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒకమాట అంటున్నాడు. “అయ్యా, మహానుభావా, నీకు తెలియని విషయం లేదు. ఇంతకు పూర్వం మేము రాజసూయ యాగం చేశాము. మాచేత ఓడింపబడని రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసమునకు వచ్చాము. అనగా ఓడలు బండ్లు అయ్యాయి. ఇప్పుడు మాకు శత్రువులు అనంతము. ఈశ్వరా, మేము ఈ సంకటం నుండి ఎలా బయటపడతాము? అన్నాడు. ఇదీ మీకు పెద్దలు కనపడినపుడు మీరు అడగవలసిన మాట. ధర్మరాజుగారు ప్రాజ్ఞుడు. మాకు ఇన్ని ఉన్నాయి అనడం లేదు. శత్రు బలమును ఎక్కువచేసి చెప్తున్నాడు. ధర్మరాజు అలా అడిగిన మీదట కృష్ణుడు ‘ఎందుకయ్యా నువ్వు బెంగ పెట్టుకుంటావు? నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు. నేను పరమశివుడిని ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను. మహానుభావుడు దీన దయాళువు ఎవరి పేరు శివుడో, ఎవడు మంగళము లన్నిటికీ కూడా ఆలవాలమో, ఎవరి అనుగ్రహం మంగళములను ఇస్తుందో, ఎవరు చెయ్యెత్తి ఆశీర్వదిస్తే నీకు శుభం జరుగుతుందో, ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నీవు బెంగ పెట్టుకోనవసరం లేదో అటువంటి పరమశివుని గురించి తపస్సు చేయండి. ఆ శంకరుడు కానీ కృపాళుడై మిమ్మల్ని అనుగ్రహించాడంటే ఎంతమంది శక్తిమంతులు అటుపక్కన నిలబడిన మీకిక ఎదురు ఉండదు. మీరు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి మీరు శివానుగ్రహమును పొందండి” అని చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు వ్యాసభగవానుడు అక్కడికి వచ్చాడు. ఆయన సాక్షాత్తు నారాయణుడు. అపుడు పాండవులు అర్ఘ్య పాద్యాదులు యిచ్చి నమస్కరించి పూజించారు. తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయా జూదంలో ఓడించారు. దుర్యోధనుడు మమ్మల్ని ఇలా అరణ్యవాసమునకు తరువాత అజ్ఞాత వాసమునకు వెళ్ళేటట్లుగా చేశాడు. మేము కృష్ణ భగవానుని ఆరాధన చేశాము. ఆయన మమ్మల్ని శంకరుని పూజ చేయమని ఆనతిచ్చాడు. మహాత్మా ఇవాళ మీరు వచ్చారు. మేము ఈ కష్టంలో ఉన్నాము. ఇదే విషయమును మీకు కూడా చెప్పుకుంటున్నాము’ అన్నారు. ఆ తరువాత ద్రౌపది మాట్లాడింది. ‘నేను ధర్మమునందు ఉన్నాను కాబట్టి మీ ఆశీర్వచనం నాకు కావాలి’ అని వ్యాసులవారితో అన్నది. తనకి జరిగిన పరాభవం గురించి చెప్పింది. ఇది చెప్పగానే వ్యాసుడి మనస్సు చిన్నబుచ్చుకుంది. నీవు శాసించగలిగిన వాడివి, నీకు ఎదురు తిరిగితే శాపవాక్యం విడిచి పెట్టగలిగిన వాడివి. అంది. కానీ శాపం ఇవ్వవలసిందని ఆవిడ అడగలేదు. ఈ విషయములను చెప్పిన తర్వాత ఇపుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు. ఇది పాండవుల ఉన్నతికి పనికొస్తుంది. తన కష్టం చెప్పి తన భర్తలను గెలిపించుకుంది. చేతకానివారై తనను ఎన్నో కష్టములు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. కౌరవులు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో చెప్పి, ఆయన సలహా చేత భర్తలను రక్షించుకుంది. ఇదీ మహా పాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుంది.
అపుడు వ్యాసభగవానుడు ‘అటు కౌరవులూ నా వాళ్ళే, మీరూ నా వాళ్ళే. కానీ ధర్మము మీ పట్ల ఉన్నది. కాబట్టి నా అనుగ్రహం మీకే ఉంటుంది. దానివలన మీరు గెలుపొందుతారు’ అని చెప్పాడు. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి ఇపుడు పాండవమధ్యముడయిన అర్జునుని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదికి పంపించండి. అక్కడ శంకరుని గూర్చి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగులేదు. అని చెప్పి వ్యాస భగవానుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు.
అర్జునుడు అన్న దగ్గర, తమ్ముళ్ళ దగ్గర శలవు తీసుకుని బయల్దేరాడు. ఇంద్రకీలాద్రి చేరుకుని శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుని తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ‘దేనికి తపస్సు చేస్తున్నావయ్యా?” అని అడిగాడు. శంకరుని అనుగ్రహం కోసం చేస్తున్నట్లు చెప్పాడు అర్జునుడు. నీకేం కావాలి? అని వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు ఆర్జునుడిని అడిగాడు. నాకు పాశుపతాస్త్రం కావాలి’ అన్నాడు. ఆయన నవ్వి ‘శంకరుడు మహాజ్ఞాని. శంకరుని అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి. అపుడు ఈ యుద్ధములు, గొడవలు అవేమీ మీకు ఉండవు. కానీ యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఎవరికయినా ఇంత తెలివితక్కువతనం ఉంటుందా! అన్నాడు. ఇపుడు ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్ర ధర్మమును విడిచిపెట్టేశాడా అని చూస్తున్నాడు. ప్ర్జునుడు అపుడు నాకేమి కావాలో తెలుసు. మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతం తెమ్మనమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకొక నమస్కారం, వెళ్ళిరండి’ అన్నాడు. అయినా వెళ్ళకుండా వేధిస్తున్నాడు ఇంద్రుడు. ఇంక నన్నుగాని విసిగించావంటే నీకు శాస్తి జరుగుతుంది. ఇక్కడనుండి పో అన్నాడు. ఇపుడు ఇంద్రుడు సంతోషించాడు. తన నిజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరీ మంత్రముతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. నీ క్షాత్రధర్మమును మాత్రం మరిచిపోకు. అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని అర్జునుడు శివుని గూర్చి ఘోరమయిన తపస్సు మొదలుపెట్టాడు.
శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. మూకాసురుడు అనే ఒక రాక్షసుడిని పిలిచి ‘నీవు ఒక బ్రహ్మాండమయిన అడవి పందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రొద చెయ్యి అన్నాడు. అది అక్కడికి వెళ్లి పెద్ద చప్పుడు చేస్తోంది. ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వీడెవడో రాక్షసుడు అయి ఉంటాడు. కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు. అని ధనుస్సును అందుకున్నాడు. శివుడు అర్జునుడికి వెనక ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అర్జునుడికి శివుడు కనపడడు. శివుడు అర్జునుడి వెనుకనుంచి అడవి పంది మీదకి బాణం ప్రయోగించాడు. అది అడవిపంది పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. ఇది శివుడి బాణం. ఆ బాణం తగిలిన వెంటనే అడవిపంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. బాణం ఎక్కుపెట్టి అడవిపందిని గురిచూసి కొట్టాడు అర్జునుడు. అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠ భాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. ఉత్తరక్షణం నేలమీద పడిపోయి చచ్చిపోయింది. శివుడి ప్రమథగణములు వెనుక కిరాతులుగా వచ్చారు. శివుడు వారిలో ఒకడిని పిలిచి తన బాణమును తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి కలహామును పెంచుకునే ప్రయత్నంగా అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన మహానుభావుడు. గొప్ప కిరాతవీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త. అన్నాడు. అపుడు అర్జునుడు నేనూ బాణం వేశాను. నా బాణానికే ఈ పంది చచ్చిపోయింది. ముందు నేనే ఎక్కుపెట్టాను అన్నాడు. ఇద్దరి మధ్యా వాదం పెరిగింది. అపుడు అర్జునుడు మీ నాయకుడు అంత గొప్ప మొనగాడయితే నాతో యుద్ధమునకు రమ్మనమని చెప్పు అన్నాడు. ఆ మాటకోసమే పరమశివుడు ఎదురుచూస్తున్నాడు.
వెంటనే శివుడు కొండమీద నుండి గభాలున దూకాడు. తన శరీరమునకు పులితోలును అడ్డంగా కట్టేసుకున్నాడు. తన కొప్పును బాగా ముడివేశాను. దానినిండా నెమలి ఈకలు పెట్టుకున్నాడు. ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. కిరాతుడి రూపంలో ఉన్న శివుడు ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి ఏరా కుర్రా, ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ బాణములను వెయ్యి చూద్దాం. ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు.
వెంటనే అర్జునుడు ముందుగా గాండీవం టంకారం చేశారు. శివుడు నవ్వి ఒక హుంకారం చేశాడు. ఆ హుంకారమునాకు అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. ఆ కిరాతుడు మామూలు వాడు కాదనుకుని అర్జునుడు తన గాండీవంలో బాణములు పెట్టి శివుని మీద ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా కోపం నటించి తన చేతిలోని ఒక ధనుస్సు ద్వారా అర్జునుని మీదకు బాణములు వేస్తున్నాడు. అర్జునుడికి మహా కోపం వచ్చేసింది. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని కొట్టేస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరమును ఎవ్వరూ తాకరో, ఎవరి శరీరం తెల్లని పేరుకున్న నెయ్యిలా ఉంటుందో, ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరమును ఇపుడు అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో కౌగలించుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకూ ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికి ఉన్న విభూతి అంతా ఈయనకు అంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి. కాబట్టి మల్లయుద్ధం పేరుతొ పరమేశ్వరుడు అర్జునుడి అవయవములన్నిటిని కౌగలించేసుకున్నాడు. తరువాత బాగా తిప్పి అర్జునుని శరీరమును త్రోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగిలేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ‘ఆహా, ఏమి మొనగాడివిరా నీవు, ఎంత పౌరుషంరా నీకు అని అనుకుని యుద్దమును చాలించాలనుకున్నాడు. అపుడు మహానుభావుడు చంద్రవంకతో, పట్టుపుట్టంతో, వామార్థ భాగమునందు పార్వతీ దేవితో అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.మళ్ళీ కొడదామని అర్జునుడు గాండీవమును ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్థనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు కనపడ్డారు. గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదముల మీద పడిపోయాడు. శంకరా, ఇంత కృపా నామీద! నాచేతి దెబ్బలు తిన్నావా! నాతో మల్లయుద్ధం చేశావా తండ్రీ అని శంకరుని పలువిధముల స్తోత్రం చేసి ఆయన పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు అర్జునుని చూసి అర్జునా నన్ను కొట్టానని ఎందుకు బాధ పడతావు? అలా అనుకోవద్దు. నీవు నాకు చేసినా పూజగా దానిని నేను స్వీకరించాను. నీకేమి కావాలో అడుగు ఇచ్చేస్గ్తాను అన్నాడు. అపుడు అర్జునుడు శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ఈశ్వరా, నీవు కంటి ఎదుట కనపడుతున్నావు. పరాత్పరుడవు. జగద్భర్తవు. అటువంటి తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణములు వేశాను. నేను కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రీ! నీ కారుణ్యంతో నాగుండె నిండిపోయింది. అని పరమేశ్వరుని పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్రంలో పాండవులు గెలిచి తీరుతారు. విజయీభవ! దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయం ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, వినినా చదువుకుని బయలుదేరినా శివదండకమును చదువుకుని బయలుదేరినా వినినా ఈ ఆఖ్యానమును చదివి నమస్కరించినా అటువంటి వారికి జటిలమయిన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక! నీకు ఏ విజయం కలుగుతుందో వినిన వారికి, చదివిన వారికి కూడా అటువంటి విజయము కలుగుగాక! అని ఆశీర్వచనం చేసి ఆర్జునుడిని పంపించాడు.

Sunday, December 13, 2015

శివపురాణము--32


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

గంగావతరణం
శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి. 
సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.

ద్వాదశ జోతిర్లింగాలు ఎవరిపేర్లపై ఏర్పడ్డాయి ?


శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.

శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం 
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం  
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.

శ్రీ వైద్యనాథేశ్వరలింగం 
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.

శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం 
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం 
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం 
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.

శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం 
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.

శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం 
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం 
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.

శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం 
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

Saturday, December 12, 2015

శివపురాణము--31



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు. ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము. సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది. అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒక నెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు. దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకా సుర సంహారం చేశాడు. లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి. యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు.

అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక

ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి. అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామివారే నేర్పారు. కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు.

సుబ్రహ్మణ్య స్వామి వారు అవతారములను స్వీకరించారు. ఇందులో ప్రధానమయిన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి.

తిరుజ్ఞాన సంబంధర్:

జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. ద్రవిడ దేశంలో శీర్గాళి అనే ఊరు పరమ పావనమయిన క్షేత్రం. అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. ఆ ఊరిలో శివ పాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భగవతి. వారికి పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన మూడు సంవత్సరముల వయసు బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయిన శివ పాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. నేనూ వస్తాను అని ఏడుపు మొదలు పెట్టాడు పిల్లవాడు. నాయనా, నాతో నీవెందుకు, వద్దు అన్నాడు తండ్రి. పిల్లవాడు వినలేదు. అపుడు పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు. పిల్లవాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది. అపుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్నా అని ఏడుస్తున్నాడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. పార్వతి వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు. అపుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు. పిల్లవాడు ఎత్తుకుని లాలించినా ఏడుపు ఆపలేదు. ఒక బంగారు పాత్రను తేసుకుఇ నీ స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి త్రాగించు వాడు ఏడుపు ఆపుతాడు అన్నాడు పరమశివుడు. అపుడు పార్వతీదేవి నాపాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది. మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా? అని అడిగింది. పిల్లవాడు మనలను నమ్మి అమ్మా నాన్నా అని ఏడ్చాడు. పాలు త్రాగించు అన్నాడు. అందుకే జ్ఞాన సంబంధర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు. మనమూ ఏడుస్తాము. కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. శంకరుడు అలా చెప్పిన పిదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీ దేవి. పాలను త్రాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్థానం అయిపోయారు. ఆయన పిల్లవాని దగ్గరికి వచ్చి నాయనా ఎంత పని చేశావురా ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా”

అన్నాడు. అపుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. మూడేళ్ళ పిల్లవాడు. భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించి పోయి భగవత్ దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే ఆ అంశాలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమయిన మార్గమును ఆ రోజులలో నలిపి వేస్తున్న వాళ్ళ దురాచారములను ఖండించదానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడు. ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు. కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోర్కె ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు. అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. శివునకు మారు పేరే జ్ఞానము. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమయిన జ్ఞానమును పొందినవాడు కనుక ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ పేరు.

వల్లీ కళ్యాణం – ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.

ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.

అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.

నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

కార్తీకపురాణము--30


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--30  

ఋషులడిగిరి. ఓ సూతమహర్షీ! మాకు పుణ్యమైనా హరి మహాత్మ్యమును జెప్పిటివి. ఇంకా కార్తికమహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిది యేది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము.

సూతుడు పల్కెను. మునీశ్వరులారా! మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్దులయిన జనులకు మోక్షోపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకయినదగుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్య తీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటలచేత లభ్యమగును. మునీశ్వరులారా! వినుడు. కార్తిక ఫలము వేదోక్తమైనది. అనగా కార్తికమందు వేదోక్త ఫలమును బొందెదరాణి భావము. కార్తిక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను గాను. కాలము చాలదు. కాబట్టి శాస్త్ర సారములలో సారమును జెప్పెడను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రమునుండి తరింతురు. కార్తికమందు హరిణి పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తిక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా! బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తిక వ్రతమును జేయని యెడల తమ పూర్వులతో కూడా అంధతామిస్రమను పేరుగల నరకమును, (చీకట్లతో గ్రుడ్డిడగు నరకము) బొందుదురు. సంశయము లేదు. కార్తికమాసమున కావేరి జలమందు స్నానమాచరించు వారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తిమ మాసమందు స్నానము చేసి హరిణి పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును. మునీశ్వరులారా! కార్తిక వ్రతమును జేయని వారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు. 

కార్తిక మాసము పుణ్యకరము. సమస్త మాసములందు శ్రేష్ఠము. కార్తిక వ్రతము హరి ప్రీతి దాయకము. సమస్త పాపహారము. దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తిక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను జేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తిక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధానము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తిక మాసమందు కథను విన్నయెడల వినిపింపజేసినా యెడల అనంత ఫలమునొందును. కార్తిక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును. సమస్త సంపత్తులను గలుగజేయును. అన్ని పుణ్యముల కంటెను అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము. 

ఇతి శ్రీస్కాందపురాణే కార్తిక మహాత్మ్యే ఫలశ్రుతిర్నామత్రింశోధ్యాయస్సమాప్తః!!

Friday, December 11, 2015

శివపురాణము--30


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

స్కందోత్పత్తి – కుమారసంభవం – 2 
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. 
ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు. 
ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు.

కార్తీకపురాణము--29


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--29  

రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానమందెను. సుదర్శన చక్రము అంతర్థానము బొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి ఇట్లని విన్నవించెను. బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని. పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నాయింటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము. నీవు నాయందు దయయుంచి తిరిగి నాయింటికి వచ్చి నన్ను రక్షించితివి. మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా యింటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని. నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవి. ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో యిట్లనియె. రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. ఇప్పుడు నీచేత నాప్రాణములు రక్షించబడినవి. కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు. తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. కాన నీకు నమస్కారమును చేయను. బ్రహ్మణ్యుడవైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని. దానికి ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి. రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మ బుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తిక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తిక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ జేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును. అందులో కార్తిక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము. కనుక దానిని ఎంతమాత్రమూ విడువరాదు. కార్తిక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు. 
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!

Thursday, December 10, 2015

శివపురాణము--29


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

స్కందోత్పత్తి – కుమారసంభవం 
మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు 13మంది భార్యలు ఈ 13మంది దక్షప్రజాపతి కుమార్తెలు. కశ్యప ప్రజాపతి భార్యలలో ‘దితి, అదితి’కి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పురాలేదు. కాబట్టి ఇపుడు తేడా క్షేత్రమునందే ఉంది. ఇప్పుడు మరల బిడ్డలు కావాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి’ అని. అపుడు కశ్యప ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణీ అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా, నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించింది ఇక్కడ. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది. 
ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేల తల విరబోసుకుని కూర్చుని ఉంది. కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిందమును ముక్కలుగా నరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. ఇపుడు దితికి మరల భంగపాటు అయింది.
ఇలా కొన్నాళ్ళు అయిపొయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. అప్పుడు నీకు నీవు కోరుకునే కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. అటువంటి తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. వాడికి దేహమునందు బలం ఉంది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. యితడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. ఇప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అపుడు బ్రహ్మ ‘నాయనా, నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. కానీ దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ‘మహానుభావా అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేనూ నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమయిన తత్త్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ఒక భార్యను ఇస్తున్నాను నేను. ఆమె పేరు ‘వరాంగి’. నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్ళిచేశారు. 
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగాడు. అపుడు వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. 
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములనన్నిటిని కాల్చేస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అపుడు బ్రహ్మ వెళ్ళాడు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దాహిస్తాడు. ఆయన కామారి. ఆయనకీ కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. 
తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. ఇపుడు వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగ మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
ఇప్పుడు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడు. ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకు విల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని దింపలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అపుడు అమ్మవారు ‘ధూర్త బ్రహ్మచారీ, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు. తరువాత అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. ఇపుడు పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.