Monday, June 24, 2013

కుమారస్వామి పుట్టుక


కుమారస్వామి పుట్టుక
పార్వతి పరమేశ్వరులు జగత్తుకు ఆది దంపతులు. వారు కైలాసాంలో నివాసం ఉంటారు. వారు ఒకసారి 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విని ఆశ్చర్యపోయిన దేవతలు పార్వతిదేవి, శంకరుడి తేజస్సులు అసమానమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే సంతానాన్ని మనం తట్టుకోలేము అని భావించారు. దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు . అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి! మీరు పార్వతిదేవి తో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక మరో ప్రాణి రూపంలో బయటకు వస్తే వాని యొక్క తేజస్సును మేము భరించలేము కనుక తమరి తేజస్సుని తమలోనే ఉంచుకుని, సంతాన ఆలోచన లేకుండా పార్వతిదేవి తో తపస్సు చేసుకోండి అన్నారు. ఏ వికారములు లేని శంకరుడు వాళ్ళు చెప్పినదానికి అంగీకరించాడు, కానీ ఇప్పటికే తన నుండి కొంత తేజస్సు కదిలింది కనుక దానిని భరించే వారు ఉంటే దానిని వదలిపెడతాను అని చెప్పాడు. అప్పుడు దేవతలు అన్నీ భరించగల భూమి దీనిని కూడా భరించగలదు అని చెప్పారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
ఇంతలో జరుగుతున్నదానిని తెలుసుకున్న పార్వతిదేవి బయటికి వచ్చి, తనకు సంతానం కలుగ కుండా చేసిన దేవతలమీద కోపంతో వారెవరికీ తమతమ భార్యల ద్వారా ఇకమీద సంతానం కలుగదు అని శపించినది. తరువాత తను భరిఒచ వలసిన శివ తేజస్సును, భూమి భరించటానికి ఒప్పుకుంది కాబట్టి ఇకనుండి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలం లో భూమికి అనేకులు భర్తలుగా ఉంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గు తో తల వంచుకుంటుందని శాపించింది. ఇక అగ్నిని సర్వభక్షకుడవు అవ్వమని శపించినది.
శంకరుడు పార్వతిదేవి తో తపస్సు చేసుకోవటానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు.
అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి, తాను పార్వతి పరమేశ్వరుల కు జన్మించే బిడ్డ చేతిలోనే చనిపోయేట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమీ చెయ్యాలో తెలియలేదు. ఇప్పుడు ఈ తేజస్సుతో పుట్టిన బిడ్డ మాత్రమే ఆ తారకాసురిడిని అంతమొందించగలడు, సాక్షాత్తు భూమి కూడా ఈ తేజస్సును భరించలేక పోయింది ఇక ఈ తేజస్సును ఎవరు తట్టుకోగలరు? ఎవరైనా తట్టుకోగలిగినా మరలా పార్వతీదేవి శాప భయం కూడా ఉంటుంది. కనుక ఏమీ తోచని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మ గారు ఆలోచించి, హిమావంతుడు మనోరమాల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు. కావున పార్వతిదేవి అక్క అయిన గంగలో తేజస్సుని విడిచిపేడితే, పార్వతిదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు.
అప్పటికి అగ్ని శక్తి క్షీణించసాగింది. ఆ తేజస్సును అగ్నికూడ భరించలేక ఉన్నాడు.
అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దైవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగా సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి, ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగా భరించలేక కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమీ చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిడేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. 
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్ధం నుంచి మిగతా ధాటువులు పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. కొంత తేజస్సుఅక్కడే ఉన్నతటాకం లో పడింది, ఆ వీర్యం ఆరు భాగాలుగా పది మల్లి ఒకటి ఐంది. ఆ ఒకటి ఐన వీర్యం నుండి ఒక బాలుడు జన్మించాడు. తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు దేవతలకు వినిపించింది.
ఆకలికి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసి దేవతలు పార్వతీపరమేశ్వరులకు పుత్రుడు కలిగినందుకు సంతోషించారు కానీ ఇప్పుడు ఈ బిడ్డ ఆకలి తీర్చటానికి ఎవరూ లేరే అని విచారిస్తున్న సమయం లో అక్కడకు కృత్తికలు వచ్చారు. ఆ బిడ్డను చుస్తే తమకు మాతృవాత్సల్యం కలుగుతుంది కనుక ఆ బిడ్డను తమ పేరు మీద కార్తికేయుడు
అని పిలిచినట్లయితే తాము అతనికి ఆకలి తీర్చగలము అని దేవతలకు చెప్పారు. అందుకు అంగీకరించిన దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏక కాలం లో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షాడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వాచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావక, అగ్నీసంభావహ అని నామాలు. అలాగే పరమేశ్వరుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైనందున పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతిదేవి లా అందంగా ఉంటాడు కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రాణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు