Monday, November 16, 2015

శివపురాణము::–5

ఓం శ్రీ గురుభ్యోనమః___/\___ 
శివపురాణము::–5
రచన::చాగంటి కోటీశ్వర రావు గారు 
చాగంటి గురువుగారి ఆశీస్సులతో 

శివనామములు: పినాకి – రుద్రుడు 
స్వామిని పినాకి అని పిలుస్తారు. పినాకి అనే నామం చాలా చిత్రమయినది. పరమశివమూర్తి పట్టుకునే ధనుస్సు సామాన్యమయిన ధనుస్సు కాదు. మేరుపర్వతమును ధనుస్సుగా పట్టుకుంటారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. వేరొక రూపమును తీసుకొని సంహారం చేయడు. కానీ శివుడు ధనుస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికముగా తెలుస్తుంది. వేదముల వలన తెలుస్తుంది. యజుర్వేదంలో శ్రీరుద్రం “నమస్తే రుద్రా మన్యవ ఉతోత ఇషవే నమః” అని ప్రారంభమవుతుంది. స్వామీ మీ కోపమునకు ఒక నమస్కారం – ఆ మాట చెప్తున్నారు. కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోడింపజేస్తాయి. మరి ఆయన ఎందుకు అలా ధనుస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మానను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. అదే మేరుపర్వతము. బంగారు ధనుస్సు! ధనుస్సు సంధించడానికి రెండు పక్కలా తూణీరములున్నాయి. దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు. మీరు చేసిన పాప ఫలితం ఉన్నది. మీరు బాధ పడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి. అందుకు గాను బాణములను తీస్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును, దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము. ఈ శరీరంతో పాప పుణ్యములను రెండింటినీ చేస్తాము. తప్పు చేశాము కాబట్టి దుఃఖము అనుభవించాలి. ‘నేను పాపము చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు. తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను. నిష్ఠతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా, నీ కోపమునకు ఒక నమస్కారం, ఈశ్వరా, నీ ధనుస్సుకు ఒక నమస్కారం, నీ బాణములకు ఒక నమస్కారం.
యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః”
కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వెయ్యాలి. నాయందు దయవుంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో. అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు, మొదట్లో పట్టుకున్న ధనుస్సుకు తేడా కనిపిస్తుంది. పినాకిని అనే శబ్దమును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది. ఇదీ అసలు ధనుస్సు. మీరు తప్పు చేస్తే ఘోరరూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది. తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు జీవితంలో శాంతమయిన శివ దర్శనమును కోరుకున్నవారాయి ఉండాలి. అనగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
ఆయన బంగారు ధనుస్సును పట్టుకుని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తునాడు. ఎంత పాపం చేసిన వాడయినా ఆయన పాదములు పట్టుకున్న వాడయితే ఆయన పాదములయందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖమును మాత్రమే యిచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు. కాబట్టి ఈశ్వరా మీరు ప్రసన్నమూర్తియై కనపడండి అని కోరుకుంటాము. అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టటానికి, మీరు చేసే పాపమునకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మీ భయం తీయడానికి ఒకడు వేరుగా ఉండరు. ‘భయకృత్ భయనాశానః’ – భయమును సృష్టించే వాడు పరమాత్మే. భయమును తీసేసే వాడూ పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందు ఉన్న జీవధార. కష్టమును కలిగించడానికి, కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టమును కాలములో మీరు మరిచేపోయేటట్లు చేసే కాలస్వరోఉదు కూడా ఈశ్వరుడే. గురుస్వరూపియై మరల వచ్చి మీ మనస్సుకు తగిలిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరల యథామార్గమునందు మళ్ళీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రము ‘పాతీతి పినాకః’ అని చెప్పింది. ఈ ధనుస్సు మీకు ఘోర రూపముతో పాఫలితమును ఇచ్చినా అఘోర రూపముతో సుఖమును ఇచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే! కనుక ఆ ధనుస్సు లోకములను రక్షించగలిగినది. అందుకే రుద్రము ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది. 
ఆఖరున ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరిని ఏడిపించే వాడు ఎవడో వాడు రుద్రుడు. మనకి మూడు ప్రళయములున్నాయి. నిత్య ప్రళయము – నిద్రపట్టేటట్లుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్యప్రళయము. రెండవది అత్యంతిక ప్రళయము – బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా వున్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగ తోసుకుని, భక్తితో కూడిన కర్మానుష్టానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధిచేత మోక్షానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు, ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహమువలననే సిద్ధిస్తుంది. రమణమహర్షి వంటి మహాభాగులు ఈవిధంగా మోక్షమును పొందుతారు. మూడవది మహా ప్రళయము. అత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు. ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్లకి సిద్ధిని ఇచ్చేస్తాడు. అల చేసిన రుద్రుడు చేతి ధనుస్సు సాత్త్వికమైనది, లోక రక్షణ హేతువైనది. అది కూడా ఆయన అనుగ్రహము. ఈ శరీరముతో ప్రయోజనమును సిద్ధింపచేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వరునిలోకి చేరుతూ ఈ శరీరమును వదలాలి. ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి. ధర్మము తప్ప వేరొక మార్గం లేదు. ఇదే శాబ్దిక ప్రమాణమయిన వేదము. ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు వేదముచేత ప్రతిపాదింపబడిన ధర్మమూ మనకు బాగా అర్థం అయేటట్లుగా గురురూపంలో వచ్చి చెప్పి, పరమాత్మవైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు. కనుక ఈ ధర్మం వైపు మన మనస్సు నడిచేలా చెయ్యగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు. అది వాడి చేత పట్టుకున్న పినాకము. దాని నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇపుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు అటువంటి వేదము మానను ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశాపాశములు ఎన్నింటితోనో తిరుగుతూ ఉంటాము. ధర్మం వైపు అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవరో వాడు రుద్రుడు. 
రుద్రా శబ్దములో ‘రుత్’ అన్నమాట ఉన్నది. ఈ రుత్ – భర్తేభ్యోద్రావయతి – రుత్ అంటే ప్రతిబంధకము – అడ్డము. ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేక పోతున్నాడు. మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు. ఎవరు భగవంతుని నిజంగా కోరుకుని నేను ఈ కోరికల వలన నిన్ను పొందలేక పోతున్నాను. వీటినుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో, ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు. మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏది ప్రతిబంధకమో ‘నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఉషావే నమః’ అని అభిషేకం చేస్తే రుద్రమును పారాయణ చేస్తే, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు. ఇది ‘రుద్రః’ – అందుకని ‘నమస్తే రుద్రమన్యవ’ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనుస్సును రుద్రశబ్దంతో కలపడంతో కలపడానికి కారణం అది.
రోదయతి శత్రూన్ ఇతి రుద్రః – ఇప్పటివరకు మిమ్మల్ని ఏడిపించిన వారు, లేదా లోకమునకు శత్రువులు అయిన వారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గమును విస్మరించి తిరిగారు. అటువంటి వాళ్ళను మట్టు పెట్టగలిగిన వాడు రుద్రుడు – వాళ్ళని ఏడిపించగలిగిన వాడు.
రోదనం ద్రావయతి ఇతివా రుద్రః – నీకు ఏదో ఒక కారణం చేత అపారమయిన దుఃఖము ఉన్నది. ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళముందే ఉంచి, ఒక్కొక్కసారి మీకు లేనిది చేయవచ్చు. శంకరుడు ధనుస్సు పట్టుకుంటే వేదములో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి. ఇలా ఎందుకు రావాలి అని అడిగారు. – “పినాకః త్రిపుర దాహకాలే జ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరు ధనుస్త్వాత్” అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదయిన మేరు పర్వతమును తన చేతిలో ధనుస్సుగా పట్టుకుని నిలబడినవాడు. అటువంటి ధనుస్సు కాంతులచేత సమస్తలోకములు కప్పబడిపోయి రాత్రి అనక, పగలనక బంగారు కాంతి యందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనుస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో, వాడిచేతి ధనుస్సే చిత్రం. అలా ధనుస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని ‘పినికి’ అని స్తోత్రం చేస్తున్నారు. 
కాబట్టి అన్ని విషయములను సమన్వయము చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనుస్సు మనలను ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు. అందువలన ధనుస్సును చూడడం, ఆ ధనుస్సు గురించి చెప్పిన రుద్రమును పారాయణ చేయడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చుని వినడం, మీకు చేతనయితే మీరే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకోవాలి.

No comments: