Saturday, December 14, 2013

శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి






శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి , సకల శ్రేయస్సును ఇస్తుంది. ఎందుచేత?
.................................

శనివారము నాడు హనుమంతుడిని పూజించడం చాల శ్రేయస్కరము. 
అని పురాణాలు చెబుతున్నాయి. 
ఎందుకంటే, హనుమంతుడు శనివారము పుట్టడం వలన అంత ప్రాధాన్యత కూడా లభించింది.

"సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః''

(అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం)
హనుమంతుని శనివారం వ్రతానికి ఒక కారణం కూడా ఉంది. 
శని గ్రహం ఎంత క్రూర స్వభావం కలవాడో, అంత సౌమ్యం కూడా కలవాడు.
ఒకానొక రోజు శనీశ్వరుడు హనుమంతుడిని సమీపించి, మారుతీ! నేను శనీస్వరుడిని. 
నేను అందరినీ పట్టి బాధించాను. కానీ, ఇప్పటి వరకు నిన్ను పట్టుకోలేకపోయాను. 
ఇప్పుడు నా చేతికి చిక్కావు. అని అంటాడు. 
అప్పుడు, హనుమంతుడు శనీస్వరుడా! నువ్వు నన్ను పట్టుకుంటావా? 
లేకా నాలో ఉంటావా? నువ్వు నాలో ఎక్కడ ఉండదలుచుకున్నావు? అని అడుగుతాడు. 
అప్పుడు శనీశ్వరుడు, నేను నీ నెత్తి మీద కుర్చుంటాను అని అంటాడు.
హనుమంతుడు, శనీశ్వరుడు కోరిక మేరకు నెత్తి మీద కూర్చుండ పెట్టుకొని, 
శనీస్వరుడిని బాధించాలని మారుతీ కి మనస్సులోని కోరిక కలిగింది. 
ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తు కొన్నాడు హనుమంతుడు.
కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. 
జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. 
ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు. 
తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. 
శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .
అప్పుడే గిజ గిజలాడి పోతున్నావే?'' అని ప్రశ్నించాడు.
"ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. 
అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను'' అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.
హనుమ "శనీశ్వరా! నా భక్తులను బాధించ రాదు, నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించేవారిని, 
నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను'' అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. 

అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. 
ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు.

"మంద వారేషు సంప్రాప్తే హనూమంతం ప్రపూజయేత్ –సర్వేశ్వాపిచ వారేషు మంద వారః ప్రశాస్యతే|
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా||''

శని వారం రాగానే హనుమంతుని పూజించాలి. 
ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. 
అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
rachana::Venkata madhu

No comments: